డేరా బాబా మళ్లీ బయటకి: 9 ఏళ్లలో 436 రోజులు పెరోల్ మీదే..
ఆయన కోర్టు దృష్టిలో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన ఒక ఖైదీ.. కానీ ఆయనకు జైలు జీవితం కంటే బయటి ప్రపంచమే ఎక్కువగా అలవాటైనట్లుంది! డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోసారి జైలు వెలుపలికి వచ్చారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలు నుంచి మంగళవారం (మే 26) ఉదయం 6:34 గంటలకు ఆయన విడుదలయ్యారు. సాధ్వి లైంగిక దాడి కేసులో దోషిగా తేలిన రామ్ రహీమ్కు హర్యానా ప్రభుత్వం ఈసారి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఈ తాజా విడుదలతో కలిపి, 2017 ఆగస్టులో శిక్ష పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన మొత్తం 436 రోజులు జైలు వెలుపల స్వేచ్ఛగా గడపడం గమనార్హం.
ఒక హేయమైన నేరంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఇన్నిసార్లు పెరోల్ లభించడం దేశంలోనే చర్చనీయాంశంగా మారింది. జైలు పాలైన ఈ తొమ్మిదేళ్ల కాలంలో రామ్ రహీమ్ ఏకంగా 16 సార్లు పెరోల్పై బయటకు వచ్చారు. ప్రారంభంలో 2020 అక్టోబర్లో కేవలం ఒక్క రోజు, 2021 మే నెలలో అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు 12 గంటల పాటు స్వల్ప పెరోల్ను మాత్రమే పొందారు.

కానీ ఆ తర్వాత నుంచి ఆయనకు వరుసగా లైన్ క్లియర్ అవుతూ వచ్చింది. 2024 జనవరిలో ఆయనకు ఏకంగా 50 రోజుల గరిష్ట పెరోల్ లభించగా.. 2022, 2023, 2025 సంవత్సరాలలో కూడా 21 నుండి 40 రోజుల వ్యవధితో పలుమార్లు జైలు బయట గడిపారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన పెరోల్ ముగిసిన కొద్ది నెలలకే, ఇప్పుడు మే నెలలో మరో 30 రోజుల పెరోల్ను ఆయన దక్కించుకున్నారు.
చట్టంలోని లొసుగులే అండగా..
రామ్ రహీమ్ ఇంత తరచుగా జైలు నుంచి విడుదల కావడం వెనుక హర్యానా ప్రభుత్వ చట్టపరమైన వెసులుబాట్లు ఉన్నట్లు జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 'హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ (మంచి ప్రవర్తన కలిగిన ఖైదీల) చట్టం-2022' ప్రకారం.. జైలులో మంచి ప్రవర్తన కనబరిచే ఖైదీలు ఏడాదికి 70 రోజుల పెరోల్, అలాగే 21 రోజుల ఫర్లో పొందేందుకు అర్హులు. రామ్ రహీమ్ చేసిన నేరాలను హర్యానా ప్రభుత్వం ఒక ప్రత్యేక వర్గీకరణ (కుట్రలు) కింద ఉంచడం వల్లే ఆయనకు ఈ తాత్కాలిక సదుపాయాలు చాలా సులువుగా లభిస్తున్నాయని చట్టపరమైన విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ ఏడాది కోటా పూర్తి!
అయితే, తాజా 30 రోజుల విడుదలటో డేరా అధిపతి ఈ క్యాలెండర్ సంవత్సరానికి (2026) తనకు అనుమతించబడిన గరిష్ట పెరోల్ కోటాను పూర్తిగా వినియోగించుకున్నట్లయింది. నిబంధనల ప్రకారం.. ఖైదీలు ఒక సంవత్సరంలో రెండు విడతలుగా గరిష్టంగా 10 వారాలు (70 రోజులు) మాత్రమే పెరోల్ పొందడానికి వీలుంటుంది. రామ్ రహీమ్ ఈ సంవత్సరం ఇప్పటికే 40 రోజుల పెరోల్ను వాడేశారు. ఇప్పుడు లభించిన అదనపు 30 రోజులతో ఆయన వార్షిక పరిమితి ముగిసింది. ఏదేమైనా, సాధారణ ఖైదీలకు దక్కని ఈ 'పెరోల్ భాగ్యం' డేరా చీఫ్కు పదే పదే లభిస్తుండటంపై నెటిజన్లు, బాధితుల తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications