జైలుకు సుమన్ రాథోడ్: యరపతనేనికి నో బెయిల్
హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో ఆరో ఫేజ్లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ప్రథాన నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
కాగా, హత్య కేసులో చిక్కుకున్న మరో తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు యరపతనేని శ్రీనివాస రావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టేసింది. కాంగ్రెసు కార్యకర్త నరేంద్ర హత్య కేసులో కుట్రదారుడిగా ఆయనపై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు బుధవారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు.
ఇదిలావుంటే, వారం రోజుల్లో ఐదుగురు శాసనసభ్యులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారే. సుమన్ రాథోడ్, యరపతనేనిలపై నమోదైన కేసులు తీవ్రమైనవి. ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీని ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ ఎస్ఇ కార్యాలయంపై దాడి చేశారనే ఆరోపణపై ఇద్దరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన శానససభ్యులు సుద్దాల దేవయ్యకు, విజయరామారావుకు బెయిల్ లభించింది.