నో కామెంట్!: ఎన్నికలపై బాలకృష్ణ, వెంట నారా లోకేష్
ఈ రోజు ఎన్టీఆర్ పదిహేడవ వర్ధంది. ర్యాలీ ప్రారంభం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. చలన చిత్ర రంగాన్ని వదులుకొని ప్రజా సేవ కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత ఆయన నిత్యం పాటించే వారన్నారు. పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాక ఎన్నో విప్లవాత్మక సంస్కరణలను ఆయన చెపట్టారన్నారు. బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
రాజకీయాలు అందరికీ తెలిసేలా చేశారన్నారు. అందరికీ సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నప్పటికీ ప్రతి ఒక్కరి ఊపిరిలో ఉన్నారన్నారు. ప్రతి ఉత్తమ సిద్ధాంతంలో ఆయన కనిపిస్తారన్నారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ ప్రజల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయారన్నారు.
ఆయన రారాజులాంటి వాడన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. అవినీతిని దరిచేరనివ్వని నేత అన్నారు. ప్రజల పట్ల అంకితభావంతో పని చేశారన్నారు. ఎన్నికల గురించి ప్రశ్నిస్తే... స్పందించేందుకు నిరాకరించారు. ఎన్నికల గురించి ఈ రోజు మాట్లాడటం అప్రస్తుతం అన్నారు. ఈ ర్యాలీలో బాలయ్య, లోకేష్లతో పాటు భువనేశ్వరి కూడా పాల్గొన్నారు.
ఎన్టీఆర్ అఖిల భారత అభిమానుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వర రావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ప్రతి సంవద్సరం జరుగుతుంది. రసూల్ పురాలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రారంభమై ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముగుస్తుంది. ప్రతి ఏడాది చంద్రబాబు నాయుడు ర్యాలీని ప్రారంభించేవారు. కానీ ఈసారి బాలకృష్ణ, నారా లోకేష్లు దీనిని ప్రారంభించారు. మామా, అల్లుళ్ల రాకతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం కనిపించింది. చంద్రబాబు పాదయాత్రలో ఉన్నారు.