వెళ్లండి: తెలంగాణపై సీమ నేతలకు అధిష్టానం చివాట్లు?
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే వారి డిమాండుకు ఢిల్లీ పెద్దలు ఘాటుగానే సమాధానమిచ్చారంట. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, మీరు వెళితే వెళ్లండి అన్ని రీతిలో మాట్లాడారట. ఢిల్లీ పెద్దల్ని కలిసిన టిజి, ఏరాసు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారట. దానికి వాయలార్ సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ ప్రాబల్యం ఉందని, తెలంగాణలో సెంటిమెంట్ ఉందని, రాష్ట్ర విభజన జరగకుండా సమైక్యంగా ఉంచితే మీరెన్ని సీట్లు గెలుస్తారని ప్రశ్నించారట.
దానికి రాష్ట్ర విభజన జరిగితే ఆ మరుక్షణం ప్రభుత్వం కూలిపోతుందని ఏరాసు, టిజి చెప్పారట. ఆ విషయం తమకు తెలుసునని, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని తమకూ సమాచారం ఉందని, చాలామంది జగన్ వెంట వెళ్లిపోతారన్న సమాచారం ఉందని, మీరంతా వెళ్లిపోతే వెళ్లండని, మేం కొత్త టీమ్ను రెడీ చేసుకుంటామని, మీరెన్ని సీట్లు ఇస్తారో చెప్పడం లేదని, తెలంగాణ ఇస్తే అక్కడ పదహారు ఎంపీ స్థానాలు వస్తాయని, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన స్థానాల వల్లే కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ఉందని, అసలు, మీరెప్పుడైనా ఉద్యమాలు చేశారా అని ఘాటుగా ప్రశ్నించారట.
ఇప్పుడు అంతా అయిపోయాక వచ్చి మాట్లాడుతున్నారని, అఖిలపక్షంలో అన్ని పార్టీలూ తెలంగాణకు సానుకూలంగానే చెప్పాయని, తాము అన్ని అంశాల పైన చర్చించామని చెప్పారట. రాయలసీమ నీటి సమస్య గురించి చర్చించాలని సీమ నేతలు ప్రశ్నిస్తే అందుకు తుంగభద్ర బోర్డుతో ఒప్పందాలున్నాయని వాయలార్ చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఒప్పందాలు ఉన్నా అవి అమలు కావడం లేదని టిజి, ఏరాసు చెబితే అవన్నీ వదిలేయాలని, మాట్లాడేదేం లేదని చెప్పారట.
తెలంగాణపై తేల్చాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఏరాసు, టిజి వెంకటేష్లు ఆ తర్వాత గులాం నబీ ఆజాద్తో అన్నారట. అందుకు ఆజాద్ వారిపట్ల కొంత కూల్గా సమాధానం చెప్పారట. ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా లేవని, 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తప్పేనని, ఆ ప్రకటన రాకుండా చూడాల్సిందని, ఇప్పుడు కూడా నెల రోజుల్లో తెలంగాణపై తేలుస్తామని కాకుండా... హోంశాఖ బాధ్యతలు కొత్తగా స్వీకరించినందున మరికొంత సమయం పడుతుందని షిండే చెప్పి ఉంటే బాగుండేదని అబిప్రాయపడ్డారట. తాను కూడా అదే చెప్పానన్నారు. నెల రోజుల్లో తేలుస్తామన్న ప్రకటన సరికాదన్నారట.