అసెంబ్లీ భవనం ఎవరిది, గాంధీని కూర్చోబెట్టారు: ఖాద్రీ
ఎర్రకోటలోని ఎరుపు, కుతుబ్మినార్ బురుజులు, తాజ్మహల్ అందాలు, చార్మినార్ మెరుపులు, మక్కా మసీదు బురుజులు.. దేశంలోని పెద్ద కట్టడాలన్నీతమ పెద్దవాళ్లు నిర్మించినవేనని అంటూ మీరేం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కట్టడాలను పరిరక్షించాలని మీకు అప్పగిస్తే విఫలమయ్యారని అన్నారు. ముస్లింలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జులుం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ బిజెపితో కలిసి చార్మినార్ వద్ద ఆలయానికి మరమ్మతులు చేయించి కోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. ముస్లింలపై కక్షగట్టారని, ఇందులో భాగంగానే తమ నేత అక్బరుద్దీన్పై కేసు పెట్టించారని అన్నారు. అక్బరుద్దీన్ను సరైన సౌకర్యాలు లేని ఆదిలాబాద్ జైలుకు తరలించారని మండిపడ్డారు.
కేసులు తమకు కొత్తేమీ కాదని, అక్బరుద్దీన్ తండ్రి, తాతలు ప్రజల కోసం జైలుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. తాను కూడా జైలుకు వెళ్లానని, జైలు తమకు అత్తగారిల్లు వంటిదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇస్తారని, అక్బరుద్దీన్ మాట్లాడితే స్వయంగా ముఖ్యమంత్రి లేచి సమాధానం చెప్తారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం మజ్లిస్ పార్టీ కొత్త పథకాలు చేపడుతోందని తెలిపారు.
పేద ముస్లింలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. హిందువులకు మజ్లిస్ వ్యతిరేకం కాదని, ఓవైసీలకు ఉన్న ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్ కాలేజీలతో పాటు ఆస్పత్రుల్లో 60 శాతం మంది మైనార్టీయేతరులే ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. చట్టం అందరికీ సమానమైనా, తాము మాట్లాడితే జైలు శిక్ష విధిస్తారు కానీ ఇతరులు మాట్లాడితే మాత్రం చట్టం వర్తించదా? అని అడిగారు.