గాలిలో 45ని. చక్కర్లు: విమానంలో టి.సుబ్బిరామి రెడ్డి
బయలుదేరే సమయానికి వాతావరణం బాగానే ఉంది. సన్నగా చినుకులు పడినా ఢిల్లీలో సైతం విమానం దిగేందుకు ఎలాంటి అవరోధం లేదన్న సంకేతాలు వచ్చాయి. కానీ, విమానం ఢిల్లీని సమీపిస్తున్నకొద్దీ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. విమానాశ్రయంలో విమానం దిగేందుకు వీలులేనంతగా రన్వేలపై దట్టమైన మంచుగడ్డలు పడ్డాయి. నల్లటి మబ్బులతో పెద్ద పెద్ద వడగళ్ల వాన కురవడం వల్ల మంచుగడ్డలు పడ్డాయి.
దీంతో దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే చక్కర్లు కొట్టాల్సివచ్చింది. విమానంలోని ప్రయాణీకులు భయానికి లోనయ్యారు. ఈ భయానక పరిస్థితి సుబ్బిరామి రెడ్డి కూడా ఎదుర్కొన్నారు. చక్కర్లు కొడుతున్న క్రమంలో ఓ దశలో విమానం నల్లటి దట్టమైన మేఘంలోకి కూడా వెళ్లిందట. ఆ తర్వాత అది కుదుపునకు గురైంది. 45 నిమిషాలు వారు ఆందోళనకు గురయ్యారు. అయితే పైలట్ చాకచక్యంతో విమానాన్ని రన్ వే మీదకు దించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.