పోటీగా కనువిప్పు:ఎన్టీఆర్పాటలతో లగడపాటి హల్చల్!
విజయవాడ: అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సీమాంధ్రలో కనువిప్పు కలిగించే కార్యక్రమాలు చేపడతానని ప్రకటించిన విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం బాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో నానా హంగామా చేశారు. బాబుకు గులాబీ పువ్వు ఇచ్చి శాంతియుతంగా తన నిరసన తెలుపుతానని చెప్పారు.
బాబు యాత్రను అడ్డుకోనని చెప్పారు. కానీ పోలీసుల గత సంఘటనలు దృష్టిలో పెట్టుకొని లగడపాటికి అనుమతించలేదు. దీంతో లగడపాటిని బాబును కలువలేకపోయారు. అయితే బాబుకు కనువిప్పు కార్యక్రమం చేపట్టే విషయంలో మాత్రం లగడపాటి తగ్గలేదు. సీమాంధ్రలో బాబుకు పోటీగా యాత్ర చేయాలని ఆయన తలపెట్టారు. బాబు రూట్ మ్యాప్ ఆధారంగా పోటీ యాత్రకు లగడపాటి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేతలతో సిద్ధమవుతున్నారు.

ఈ నెల 26 లేదా 27 తేదిన లగడపాటి కనువిప్పు యాత్ర ప్రారంభం కానుంది. సమైక్యాంధ్రపై బాబుకు కనువిప్పు కలిగించేందుకు తన ప్రయత్నాన్ని మానుకునేది లేదని చెప్పారు. సీమాంధ్రలో ఎక్కడో ఓ చోట ఆయనను కలుస్తానని చెప్పారు. తన రూట్ మ్యాపును బాబు వస్తున్నా మీకోసంకు సమానంగా ఉండటమే కాకుండా ఎక్కడో ఓ చోట ఆయన యాత్రలో కలిసేలా ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఇందుకు పోలీసులు అనుమతిస్తారా అనేది ప్రశ్న. పోలీసులు అనుమతించక పోవచ్చునని అంటున్నారు.
ఈ యాత్రలో లగడపాటితో పాటు జిల్లాతో పాటు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు, సమైక్యవాదులు పాల్గొంటారు. తన కనువిప్పు యాత్రలో లగడపాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు పాటలతో హల్చల్ చేయనున్నారట. తెలుగు వారి ఐక్యత పైన ఎన్టీఆర్ పాటలు, ప్రసంగాలు తన యాత్రలో వినిపిస్తారని అంటున్నారు. బాబు పాదయాత్ర 27న విజయవాడ నగరంలోకి ప్రవేశించనుంది.












Click it and Unblock the Notifications