అధ్యక్ష పదవి: గడ్కరీకి ఐటి ఎసరు, బరీలో రాజ్నాథ్
జాతీయాధ్యక్షుడిగా రాజ్నాథ్ సింగ్ పేరు దాదాపు ఖరారైంది. తన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం లేనిపక్షంలో రాజ్నాథ్ సింగ్కు తాను మద్దతిస్తానని ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషితో నితిన్ గడ్కరీ అనడంతో రాజ్నాథ్కు మార్గం సుగమమైంది. గడ్కరీకి చెందిన పుర్తి గ్రూప్నకు అనుబంధంగా ఉన్న సూట్కేస్ కంపెనీలలో మంగళవారమే ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడంతో.. అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని కొనసాగించడమేంటన్న వాదనలు గట్టిగా వినిపించాయి.
చివరకు.. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టకూడదని తాను నిర్ణయించుకున్నానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీకి సేవ చేస్తానని గడ్కరీ వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలు పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించకూడదని భావించడం వల్లే పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు మంగళవారం రాత్రి ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా పోటీలో ఉంటారన్న కథనాలు వస్తున్నాయి. అగ్రనేతల మద్దతు మాత్రం రాజ్నాథ్కే ఉండటంతో ఆయన పేరు ప్రకటించడం లాంఛనమేనని అంటున్నారు.
ఐటి సోదాలు
ముంబైలోని తొమ్మిది ప్రాంతాల్లో పుర్తి గ్రూప్నకు సూట్కేసు కంపెనీలుగా భావిస్తున్న కొన్ని కంపెనీల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేసింది. పుర్తి గ్రూప్పై ఇంతకు ముందు చేసిన సోదాలకు కొనసాగింపుగానే ఇప్పుడు కూడా సోదా చేసినట్లు ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 11 ప్రాంతాల్లో 24 కంపెనీలున్నట్లు చెప్పినా, ఏవీ కనిపించ లేదని.. రెండు చోట్ల అయితే అసలు చిరునామాలు కూడా తప్పని ఐటీ అధికారులు తెలిపారు.
అయితే, ఆదాయపన్నుశాఖ కొన్ని కంపెనీల్లో సోదాలు చేసిందని, వాటికి తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని పుర్తి గ్రూప్ తెలిపింది. వీటిలో కొన్ని పుర్తి గ్రూప్నకు చెందిన కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని పుర్తి పవర్ అండ్ సుగర్ లిమిటెడ్ ఎండీ సుధీర్ దివే తెలిపారు. తన అధ్యక్ష పదవి అవకాశాలను కాలరాసేందుకే యూపీఏ ఇలా కుట్ర చేస్తోందని గడ్కరీ మండిపడ్డారు. తన తప్పున్నట్లు తేలితే పదవి నుంచి తప్పుకోడానికి వెనుకాడేది లేదన్నారు.