కెటిఆర్, స్వామిగౌడ్ అరెస్ట్: వైయస్ విగ్రహానికి నిప్పు
ఉండవల్లి మాటలు పట్టించుకోవద్దు
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను తెలంగాణవాదులం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోదండరామ్ అన్నారు. తెలంగాణవాదులు వాటిని సీరియస్గా తీసుకోవద్దు అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై ప్రకటన రాకుంటే అంతర్గతంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పోలీసుల ఇందిరాపార్కు వద్ద దీక్ష అడ్డుకుంటే ఎక్కడైనా జరిపితీరుతామన్నారు.
ఎక్కడ ఎలా అనేది మీరే చూస్తారన్నారు. రాజకీయ పరిష్కారాన్ని శాంతిభద్రతల కోణంలో చూడవద్దన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. కేంద్రం తీరు అంతుపట్టడం లేదని, ఏదో అంతుచిక్కని వైష్ణవమాయలా ఉందన్నారు. సమర దీక్ష తర్వాత చలో హైదరాబాద్ ఉంటుందని చెప్పారు.
స్వామి గౌడ్, కెటిఆర్ అరెస్టు
అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామి గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారిని కంచన్ బాగ్ పోలీసు స్టేషన్కు తరలించారు. తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు తెరాస భవన్కు చేరుకున్నారు. తెలంగాణవాదుల ఆందోళనతో హైదరాబాదులో టెన్షన్ టెన్షన్గా ఉంది. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్లో వైయస్ విగ్రహానికి నిప్పు
వరంగల్ జిల్లాలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు విగ్రహం చుట్టు ఇనుము ముళ్ల కంచె వేశారు.