వెయిట్ అండ్ సీ!: డెడ్‌లైన్‌లేదని ఆజాద్, తెలంగాణ ఫైర్

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్రమంత్రి, ఎపి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం సాయంత్రం ప్రకటన చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై తేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గడువు కోరుతోందని ఆజాద్ అన్నారు. ఈ అంశంపై ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉందన్నారు.

తెలంగాణ అంశంపై ఇరు ప్రాంతాల నుండి సంప్రదింపులు కొనసాగిస్తామన్నారు. తెలంగాణకు ఎలాంటి డెడ్ లైన్ లేదన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఢిల్లీకి పిలిపిస్తామని వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. తాను చెప్పేది కాంగ్రెసు పార్టీ అభిప్రాయం మాత్రమే అని ఆయన అన్నారు.

తెలంగాణపై నిర్ణయాన్ని, గడువును కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతారన్నారు. మూడు ప్రాంతాల నేతలతో మాట్లాడాల్సి ఉందన్నారు. సీనియర్ పార్టీ నేతలతో మాట్లాడుతామన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించడమే తమ ముందు ఉన్న ధ్యేయం అన్నారు. ఢిల్లీలో మళ్లీ చర్చలు జరుపుతామని, లోతుగా చర్చలు జరగాల్సి ఉందన్నారు. కీలక నేతలను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతామన్నారు.

పాతపాటే

తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యల్లో కొత్తదనం ఏమీ లేదు. ఎప్పుడూ చెప్పేదే ఆయన ఈ రోజు చెప్పారు. తెలంగాణ సమస్యకు మరికొంత సమయం పడుతుందని, అన్ని ప్రాంతాల నేతలతో చర్చించాల్సి ఉందని, పరిష్కరించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఎప్పుడు పాడే పాత పాటనే ఆయన పాడారు.

తెలంగాణవాదుల మండిపాటు

హరీష్ రావు

కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు వెంటనే ఆ పార్టీ నుండి బయటకు రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో, వ్యక్తలు మధ్య ఎలాంటి సమన్వయం లేదన్నారు. కాంగ్రెసు మోసపూరిత వైఖరి బయటపడిందన్నారు. తెలంగాణకు కాంగ్రెసు వెన్నుపోటు పొడిచిందన్నారు. మంత్రులు రాజీనామా చేసేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఆ పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. షిండే హామీని అవమానించేలా ఆజాద్ ప్రకటన ఉందన్నారు.

గూండా మల్లేష్

ఆజాద్ వ్యాఖ్యలు సరికాదని సిపిఐ ఎమ్మెల్యే గూండా మల్లేష్ అన్నారు. ఆయన బుర్రలో పెండ ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు నిజాం ప్రభుత్వాన్ని గద్దె దించిన ఘనత ఉందన్నారు. నిరంకుశ నిజాంకు అప్పుడు ఎలాంటి గతి పట్టిందో తెలంగాణను తేల్చకుంటే కాంగ్రెసు పార్టీకి అదే గతి పడుతుందన్నారు. ఖబర్దార్ కాంగ్రెసు అన్నారు.

జూపల్లి కృష్ణా రావు

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు మాటలు కట్టిపెట్టి ఇక రాజీనామాలు చేయాలని జూపల్లి కృష్ణా రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాకపోవడానికి సీమాంధ్ర నేతలు ఎంత బాధ్యులో తెలంగాణ కాంగ్రెసు నేతలు కూడా అంతే బాధ్యులు అన్నారు. తెలంగాణపై కేంద్రం చెప్పిందే చెబుతున్నా వారు ఇంకా అదే పార్టీలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు చస్తుంటే ఇంకా పదవులు పట్టుకొని వెళ్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఓయు జెఏసి

ఆజాద్ ప్రకటనపై ఓయు జెఏసి మండిపడింది. కాంగ్రెసు నేతలపై భౌతిక దాడులకు దిగుతామని హెచ్చరించింది. తెలంగాణలో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ఉండనిచ్చేది లేదన్నారు.

ఉద్యోగ జెఏసి

కాంగ్రెసు పార్టీ మొదటి నుండి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఆజాద్ నుండి ఇలాంటి ప్రకటన వస్తుందని తెలుసన్నారు. తెలంగాణ సాధించే వరకు తాము పోరాటం చేస్తామన్నారు.

చాడ వెంకట రెడ్డి

కాంగ్రెసు నైజాం వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా ఉందని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి విమర్శించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాటలను ఆజాద్ వమ్ము చేశారన్నారు.

కెటిఆర్

ఆజాద్ వ్యాఖ్యల్లో కొత్తేమీ లేదని కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఎప్పుడు చెప్పే మాటలే అన్నారు. కాంగ్రెసు మోసపూరిత వైఖరి మరోసారి బయటపడిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెసు తీరు కుక్కతోకర వంకర బుద్ధి లాంటిందన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

మోత్కుపల్లి

తెలంగాణ అంశంపై మళ్లీ చర్చలు జరపాల్సిన అవసరం లేదని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+