'బాబు ఆరోగ్యం బాగాలేదు: మోకాళ్ల నొప్పి, వేలి గాయం'
బాబుకు షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఎడమకాలు కండరాలు పూర్తిగా వాచిపోయాయని వైద్యులు పరీక్షల అనంతరం చెప్పారు. షుగర్ లెవల్స్ నియంత్రణలో లేవన్నారు. పాదయాత్ర కొనసాగిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని బాబుకు సూచించినట్లు చెప్పారు. ఆయన ససేమీరా అన్నారని, మూడు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆయన అంగీకరించారని చెప్పారు.
రేపు బాబు పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు పార్టీ సీనియర్ నేతలు గరికపాటి రామ్మోహన్ రావు, దేవినేని ఉమామహేశ్వర రావులు చెప్పారు. బాబు యాత్ర కొనసాగింపు ఎప్పుడనేది రేపు సాయంత్రం ప్రకటిస్తామని చెప్పారు. పాదయాత్ర కొనసాగించినా షెడ్యూలను కుదించే నిర్ణయాన్ని చర్చిస్తామన్నారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని, మూడు రోజుల విశ్రాంతికి బాబు ఒప్పుకున్నారన్నారు.
పాదయాత్ర కొనసాగిస్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయని వైద్యులు చెప్పారన్నారు. వైద్యపరీక్షల్లో కీళ్ల నొప్పులు ఉన్నాయని తెలిసిందన్నారు. వైద్య పరీక్షల తుది నివేదికలు రేపు వస్తాయని, అప్పటి వరకు వేచి చూస్తామని గరికపాటి, దేవినేనిలు ఈ సందర్భంగా చెప్పారు.