రేపుతెలంగాణపై ప్రకటన: శీలం, హైదరాబాద్ తప్ప: హర్ష
ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్లకు సొంత అభిప్రాయాలు ఉండకూడదన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. అయితే హైదారాబాదే అసలు సమస్య అన్నారు. హైదరాబాదుతో సీమాంధ్ర ప్రజలకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఉండవల్లి జై ఆంధ్రప్రదేశ్ తప్పు కాదని, ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చన్నారు. కానీ ఆయన జై ఆంద్రా నుండి జై ఆంద్రప్రదేశ్కు ఎందుకు మారారో చెప్పలేక పోయారన్నారు. సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్ చెప్పేందుకు ఆయన సభ పెట్టారన్నారు. హైదరాబాద్ తప్ప తాము విభజనకు వ్యతిరేకం కాదన్నారు.
ఓఎన్జిసి హరిత భవన్ను హైదరాబాదులో ఏర్పాటు చేయడాన్ని హర్షకుమార్ తప్పు పట్టారు. హరిత భవన్ను రాజధానిలో ఏర్పాటు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. సహజవనరులు కోస్తాలో ఉండగా హైదరాబాదులో హరిత భవన్ కార్యాలయం సరికాదన్నారు. రాజమండ్రిలో దీనిని ఏర్పాటు చేయాలన్నారు. కష్టం, నష్టం రాజమండ్రి ప్రజలది అయితే, లాభం హైదరాబాదుకా అని ఆయన అన్నారు.
రేపు సాయంత్రం తెలంగాణపై ప్రకటన
రేపు సాయంత్రంలోగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని జెడిశీలం గుంటూరు జిల్లాలో అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సంయమనంతో ఉండాలని పిలుపునిచ్చారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు తెలంగాణ ప్రాంత నేతలు వారి వాదనలను, తాము తమ వాదనలను వినిపించామని ఆయన అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి కర్నూలు జిల్లాలో అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన కోరారు.
ప్రకటన వెలువడదు
సోమవారం కేంద్రం నుండి తెలంగాణపై ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశాలు లేవని మంత్రి టిజి వెంకటేష్ వేరుగా అన్నారు. ఎలాంటి ప్రకటన వచ్చే అవకాశాలు లేని కారణంగా పదవులకు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏరాసు, టిజి వెంకటేష్ ఇళ్లను సమైక్యవాదులు ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.