జగన్ వర్గంపై బొత్స 'వేటు' కలకలం: ఆ ఇద్దరు ఎవరు?
బహిష్కరింపబడిన ఆరేడుగురు ఎమ్మెల్యేలపై స్పష్టత ఉన్నప్పటికీ మిగిలిన వారెవరనే చర్చ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, ఆళ్ల నాని, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాల రాజేష్ల పేర్లలో క్లారిటీ ఉంది. అయితే మిగిలిన వారి పైనే చర్చ సాగుతోంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జోగి రమేష్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
సమావేశం సమయంలో మిగిలిన వారు ఎవరని ప్రశ్నించినా బొత్స సరైన సమాధానం ఇవ్వలేదు. మీకే తెలుసు అన్నట్లుగా మాట్లాడారు. దీంతో పెద్దిరెడ్డి, జోగి, బూచేపల్లిలే కావొచ్చునని అంటున్నారు. వీరు ముగ్గురు ఇటీవల జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బొత్స వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎసరు తెస్తుందా? అనే చర్చ కూడా సాగుతోంది.
తొమ్మిది మంది పైన వేటు అంటే కిరణ్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బొత్స తొందరపడి వ్యాఖ్యలు చేశారా? లేక ఆలోచించే చేశారా? అనే చర్చ కాంగ్రెసు వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే మజ్లిస్, తెలంగాణ నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి బొత్స వ్యాఖ్యలు మరింత ఇబ్బందులు తెచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.