శంకరన్నఅరెస్ట్: టార్గెట్ ముఖ్యమంత్రి, అండగా కొందరు

శంకరరావు అరెస్టు తీవ్ర దుమారం రేపటంతో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి డిజిపి దినేష్ రెడ్డి, సిపి అనురాగ్ శర్మతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి ప్రసాద రాజులు కలిశారు. పోలీసుల తీరుపై వారు కిరణ్కు ఫిర్యాదు చేశారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి పొన్నం పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
శంకరరావు అరెస్టు సమయంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. శంకరరావుకు ప్రభుత్వమే వైద్యం చేయించాలన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు తలదూర్చడమేమిటని ప్రశ్నించారు. పెద్దపల్లి ఎంపి వివేక్ ముఖ్యమంత్రి పైన నిప్పులు చెరిగారు. శంకరరావు వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. నోటీసులు జారీ చేయకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసుల తీరు సరికాదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెసు శంకరరావు వెనుకాలే ఉందన్నారు. దళితుడు కాబట్టే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, చర్యలు తీసుకోవాలని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు.
దళితులమంతా ఏకమై కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఆ పదవి నుండి తప్పించాలన్నారు. ఎర్ర చందనం కేసు ఉపసంహరించుకోనందుకే శంకరరావుపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. దళితుడు కాబట్టే సిఎం, హోంమంత్రి, డిజిపి వేధిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications