కిరణ్పై బొత్స కుట్ర: జోగీ రమేష్ తిరుగుబాటు
రాజ్యాంగ సంక్షోభానికి బొత్స తెర తీశారని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిందని బొత్స ఎలా చెబుతారని ఆయన అడిగారు. బలనిరూపణకు గవర్నర్ ఆదేశిస్తే ఏం చేస్తారని, తెలుగుదేశం పార్టీ మద్దతుతో గట్టెక్కుతారా అని ఆయన అడిగారు. బొత్స వ్యాఖ్యలతో ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు తేలిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో కల్లోలం సృష్టించడానికి, కాంగ్రెసులో అంతర్గత కలహాలు సృష్టించడానికి బొత్స ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
శానససభ్యులను బహిష్కరించి పాలన ఎలా సాగిస్తారని ఆయన అడిగారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా తమను ఎలా పార్టీ నుంచి బహిష్కరిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు కుమ్మక్కయిందనే వార్తలకు బొత్స వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. బహిష్కరణకు తాను భయ పడేది లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పంథాను, విధానాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఏవిధమైన తప్పు చేశానో బొత్స చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తానేమీ భుజాలు తడుముకోవడం లేదని, బహిష్కరణకు గురైన శానససభ్యులెవరో బొత్స చెప్పాలని ఆయన అన్నారు.
సంఖ్యా బలం లేదని బొత్సనే అంగీకరించినప్పుడు పరిపాలన చేసే అర్హత కాంగ్రెసు పార్టీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం రావణ కాష్టంలా తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో రగులుతుంటే పరిష్కారం చూపకుండా ఎంత కాలం నానుస్తారని మాత్రమే తాను అడిగానని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని చెప్పానని, దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. కాంగ్రెసును తాను ఎప్పుడూ కించపరచలేదని చెపపారు.
కాంగ్రెసు పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని మాత్రమే తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు జోగి రమేష్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా అని అడిగితే ఇప్పుడైతే తాను కాంగ్రెసు శాసనసభ్యుడిగానే మాట్లాడుతున్నానని ఆయన జవాబు ఇచ్చారు.