నీకిది నాకది: కాంగ్రెస్, తెరాసలపై నారాయణ నిప్పులు
ఒక బ్రహ్మాండమైన ఉద్యమానికి రాజకీయ విలీనాల ద్వారా పరిష్కారం లభిస్తుందని సూచించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని నారాయణ అబిప్రాయపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టేందుకు ప్రయత్నించడం నీచత్వమన్నారు. తెలంగాణ ఇస్తే పార్టీని కలిపేస్తామని తెరాస ఆహ్వానించడం, బేషరతు విలీనం లేఖ ఇస్తే తెలంగాణ వచ్చేస్తుందంటూ కాంగ్రెసు ఉదారత చాటుకోవడం తెలంగాణ మహోద్యమానికి, మూడుకోట్ల మంది ప్రజలకు అవమానకరమే అన్నారు.
ఆ రెండు పార్టీలు తెలంగాణ అంశాన్ని నీకిది - నాకిది(క్విడ్ ప్రోకో) స్థాయికి దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఓ రాజకీయ పార్టీ విలీనం ద్వారా గొప్ప ఉద్యమానికి ముగింపు వస్తుందనుకోవడం సరికాదన్నారు. కేంద్రమంత్రి వాయలార్ రవి వంటి నేతలు తెలంగాణకు సానుకూలమని చెబుతూనే.. సీమాంధ్ర నేతలతో మీ ప్రాంతాల్లో ఉద్యమాలు ఏవని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను, తన రాజకీయ కర్తవ్యాన్ని తెరాస కాంగ్రెసు పాదాల చెంత చేర్చే ప్రయత్నం చేయడం సామూహిక ఆత్మహత్య వంటిదే అన్నారు.
రెండో రాజధానిగా హైదరాబాద్
హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని తెలుగుదేశం పార్టీ నేత సుధీష్ రాంభొట్ల డిమాండ్ వేరుగా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా.. హైదరాబాద్ వారికి రాజధానిగా ఉంటుంది కాబట్టి వారు దీనిపై అభ్యంతరం వ్యక్తం కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. అంతేగాకుండా.. దీనిపై సీమాంధ్ర ప్రాంతం నుంచీ పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాదని పేర్కొన్నారు.