జాతీయస్థాయిలో 'టి' ఒత్తిడి: సోనియా తర్జన, త్వరలో..
ప్రస్తుతం తెలంగాణపై కోర్ కమిటీ సభ్యులు తీవ్రంగా చర్చిస్తోంది. ఈ వారంలోపు కిరణ్, బొత్సలకు ఆ తర్వాత మూడు ప్రాంతాల ముఖ్య నేతలకు పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మాయావతి ఆధ్వర్యంలోని బిఎస్పీ, శదర్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపి, ఇటీవలె టిఆర్ఎల్డీని తెలంగాణలో స్థాపించిన ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్ తదితర పక్షాలు తెలంగాణపై సానుకూల వైఖరి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
దీంతో త్వరగా ఈ సమస్యను తేల్చేయాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోంది. అందులో భాగంగా కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో ప్రయోజనం కలిగించే విశాల దృక్పథంతోనే కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఎంతో కాలంగా రాష్ట్రంలో ఉద్యమాలు నడుస్తుండడం, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతుండటం వంటి కారణాల నేపథ్యంలో రాష్ట్ర విభజన దిశగా ఆలోచించే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయని తెలుస్తోంది. విభజనకు జై కొడితే, కనీసం పలువురుసీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్టీకి రాజీనామా చేస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయట. కిరణ్ సర్కారు పడిపోతుందన్న నివేదిక కూడా అందినట్లు తెలిసింది. పలువురు ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ఏర్పాటుపై సానుకలత వ్యక్తం చేయలేదట. సోనియాను కలిసిన ఓ నేత తొందరపాటు నిర్ణయం వద్దని సూచించారట.
దీంతో సోనియా తెలంగాణకు సానుకూలంగా ఉన్నప్పటికీ ఏం చేయాలో అర్థం కాక నిర్ణయంపై తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు. పార్టీలో అంతర్గతంగా వస్తున్న వ్యతిరేకత వల్లే ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారట. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనుసరిస్తున్న వ్యూహం కూడా ఆమెను చికాకు పరుస్తోందట. ఇప్పుడే తెలంగాణ ఇస్తే ఆ క్రెడిట్ తెరాస, బిజెపి తదితర విపక్షాలకు వెళ్తుందని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారట.