తెలంగాణ: వైయస్ నుండి జగన్ వరకు.., వారే కీలకం!
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 2009కి ముందు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు నానగా.. ఇప్పుడు ఆయన తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు అందరి నోళ్లలో నానుతోంది. మంత్రి పదవి రాలేదనే కోపంతో 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీని స్థాపించారనే ఆరోపణలు ఉన్నాయి.
తెరాస స్థాపనతో తెలంగాణవాదం ఊపందుకుంది. తెలంగాణ సెంటిమెంట్ బలాన్ని గుర్తించిన కాంగ్రెసు 2004 ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెసు విజయం సాధించడమే కాకుండా తెరాస ఆ ఎన్నికల్లో 26 సీట్లలో గెలుపొందింది. ఉద్యమం ఊపందుకుంటున్న సమయంలో దివంగత వైయస్ తెరాస నుండి గెలిచిన సగం మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కాంగ్రెసులో చేర్చుకున్నారు.
నాటి నుండి వైయస్ తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డారు. వైయస్ ఉన్నప్పుడు నయానో లేదా భయానో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన అందుకు తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వినియోగించే వారనే విమర్శలు ఉన్నాయి. అందుకు 2009 ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగిన వెంటనే సీమాంధ్ర ప్రచారంలో వైయస్ హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలా? అని ప్రశ్నించి పెద్ద దుమారం రేపారు.

వైయస్ఆర్ ఉన్నప్పుడు నయానో భయానో తెలంగాణను అణిచి వేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ కారణంగా కాంగ్రెసు తెలంగాణపై నిర్ణయాన్ని తీసుకునే విషయంలో తర్జన భర్జన పడుతోంది.

వైయస్ఆర్ ఉన్నప్పుడు ప్యాంట్లు తడుపుకున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని మధుయాష్కీ నాలుగు రోజుల క్రితం అన్నారు.

జగన్ సమైక్య రాష్ట్రానికే సిఎం కావాలని భావిస్తున్నారని, రాష్ట్రాన్ని ఇలాగే ఉంచితే జగన్తో మద్దతిప్పిస్తానని కెవిపి రామచంద్ర రావు అధిష్టానంతో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.

2004లో తెరాస తరఫున 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో సగం మందిపై వైయస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించారనే వాదనలు ఉన్నాయి.

అప్పుడు వైయస్ ఉద్యమ వేడి పెరగకుండా జాగ్రత్త పడితే, ఇప్పుడు ఉద్యమం బాగా ఉన్నప్పటికీ జగన్ కాంగ్రెసును వీడినందువల్ల ఆయనను పరిగణలోకి తీసుకొని నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి కాంగ్రెసుకు ఏర్పడింది.
వైయస్ ఉద్యమం ఎగిసి పడకుండా, ఎగిసిపడ్డా చల్లార్చడంలో తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేసే వారంటారు. నాలుగు రోజుల క్రితం తెలంగాణకు కాంగ్రెసు అనుకూలంగా ఉంటుందనే ప్రకటన వచ్చాక కూడా.. ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. తెరాస కూడా రాజీనామాలకు డిమాండ్ చేసింది. దీంతో నిజామాబాద్ ఎంపి మధు యాష్కీ మాట్లాడుతూ.. వైయస్ ఉన్నప్పుడు ప్యాంట్లు తడుపుకున్న వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంటే వైయస్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడకుండా ఏ మేరకు ప్రయత్నాలు చేశారో ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
అయితే, వైయస్ మృతి తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక్కసారిగా ఎగిసిపడింది. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసింది. ఆ తర్వాత సీమాంధ్ర నేతల వరుస రాజీనామాలతో కేంద్రం అదే నెల 23న ప్రకటనపై వెనక్కి తగ్గింది. అయితే ఆ తర్వాత ఉద్యమం వేడెక్కింది. జగన్ కాంగ్రెసులో పార్లమెంటులో ఉన్నప్పుడు సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకొని హల్ చల్ చేశారు. కాంగ్రెసు పార్టీలో ఉన్నంత వరకు తెలంగాణ విషయంలో ఆయనపై పెద్దగా చర్చ జరగలేదు. అయితే ప్లకార్డు పట్టుకున్నందుకు మాత్రం వరంగల్ జిల్లా మహబూబాబాదులో మాత్రం తెలంగాణవాదులు ఆయనను అడ్డుకున్నారు.
జగన్ సొంత కుంపటి పెట్టి సీమాంధ్ర, తెలంగాణలో బలం పుంజుకున్నారు. తాజాగా తెలంగాణ విషయంలో జగన్ పేరు మళ్లీ ఆయన తండ్రిలా నానుతోంది. తెలంగాణ రావాలన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నా ఇప్పుడు కాంగ్రెసు పార్టీ జగన్ విషయమై ఆలోచిస్తోంది. జగన్ తమకు చేయి అందిస్తే సమైక్యాంధ్రకు లేదంటే తెలంగాణకు జై కొట్టాలనే ఆలోచనలో ఉందని అంటున్నారు. జగన్ వ్యక్తిగతంగా సమైక్యవాది అని, సమైక్య రాష్ట్రానికే ఆయన సిఎం కావాలనే గట్టి ఉద్దేశ్యంతో ఉన్నారట. కెవిపి అదే విషయాన్ని చెప్పి సమైక్యంగా ఉంచాలని అలా అయితే జగన్తో మద్దతిప్పిస్తామనే హామీ కూడా ఇచ్చారట.












Click it and Unblock the Notifications