నీరజ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత: హరీష్ కాలికి గాయం
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. పోరాడి తెలంగాణ సాధించుకుందామని, ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ స్పష్టమైన వైఖరి తెలుపలేదని కాబట్టి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్యలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అనంతరం మానవ హారం నిర్వహించారు.
ఆ తర్వాత నీరజ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ములుగు రోడ్డులో మంత్రి బస్వరాజు సారయ్య ఫ్లెక్సీని తెలంగాణవాదులు దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదిరింది. పోలీసుపై తెలంగాణవాదులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. తోపులాటలో ఎమ్మెల్యే హరీష్ రావు గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయం కావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించారు. తెలంగాణవాదులు టిడిపి ఎంపీ గుండు సుధారాణి సుప్రభ హోటల్ పైన రాళ్లతో దాడి చేశారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపైనా రాళ్లతో దాడి చేశారు.
కాగా సోమవారం ఉదయం భరద్వాజ్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కళాశాలకు వెళ్లిన అతను మరుగుదొడ్డిలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న డీజిల్ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. సహచర విద్యార్థులు వరంగల్లోని మహాత్మా గాంధీ మెమోరియల్(ఎంజిఎం) ఆసుపత్రికి తరలించారు.