మోసగాళ్లకు మోసగాడు: వైయస్ జగన్పై చంద్రబాబు
కృష్ణాజిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి జిల్లాలో నడకకు శ్రీకారం చుట్టారు. ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట, దౌలత్నగర్, మంగళగిరి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి మీదుగా 17 కిలోమీటర్లు నడిచారు. తెలుగు యువత నాయకులు అందించిన పట్టు వ్రస్తాలను చంద్రబాబు కృష్ణానదిలో జారవిడిచారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మకు నమస్కరించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డప్పు కొట్టి శ్రేణులు ఉత్సాహపరిచారు.
ఎంఆర్పీఎస్ కార్యకర్తలు స్వహస్తాలతో తయారు చేసిన పాదరక్షలను బాబుకు బహూకరించారు. అక్కడ ఇంచుమించు ముప్పావుగంట పాటు మండుటెండలో నిలబడి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వైసీపీలను తూర్పారబట్టారు. జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా అని కొందరు ప్రశ్నిస్తున్నారని, సెక్రటేరియట్కు వెళ్లకుండానే ఆయన రూ. లక్ష కోట్లు దోచారని, అదే వెళ్లి ఉంటే రాష్ట్రంలో పంచభూతాలూ మిగిలేవి కావని అన్నారు.
2004లో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలో దోపిడీకి బీజం పడిందని ఆరోపించారు. 2009 ఎన్నికలకు ముందు ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసి వైయస్సార్ పోయారని, 'కిరికిరి' సీఎం కిరణ్కుమార్రెడ్డి వచ్చి వీటీపీఎస్కు నాసిరకం బొగ్గు పంపించి డబ్బులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు.
కృష్ణానదిలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక ప్రదేశంగా తాను అభివృద్ధి చేయగా, రియల్ ఎస్టేట్ పేరుతో దాన్నీ కొట్టేయడానికి కాంగ్రెస్ దొంగలు చూస్తున్నారని అన్నారు. పేద ప్రజలకు 100 చదరపు గజాల స్థలం ఇవ్వని వైయస్సార్ తన అల్లుడికి మాత్రం బయ్యారంలో లక్షన్నర ఎకరాల గనులను ధారాదత్తం చేశారని ఆరోపించారు. "జగన్కు బెయిల్ ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలి. జగన్ రూ. లక్ష కోట్లు దోచారని సాక్షాత్తు ఒక న్యాయమూర్తే అన్నారు. దీనిని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోంది'' అని ప్రజలకు వివరించారు.