ఉరితీత సరికాదు: ఓమర్, బయటకు వస్తే తిరిగొస్తారా?
అఫ్జల్ను ఉరి తీయకుండా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉరితీసే ముందు అఫ్జల్ను కలుసుకునేందుకు, ఆ తర్వాత అతని అంత్యక్రియలకు అఫ్జల్ కుటుంబ సభ్యులను అనుమతించక పోవడం సరికాదన్నారు. అఫ్జల్ ఉరి విచారకరమని, దీని ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుందని, పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉందని ఓమర్ అన్నారు. కాశ్మీరులోని ఓ తరం ప్రజలు తమని తాము బాధితులుగా భావిస్తున్న విషయం అర్థం చేసుకోవాలన్నారు. కాశ్మీరు యువతకు అక్బర్ ఉరి ఆగ్రహాన్ని కలిగించవచ్చునన్నారు.
ఉరితీత జరిగుండాల్సింది కాదన్నదే తన అభిమతమన్నారు. అఫ్జల్ ఉరికంటే న్యాయపరమైన విషయాలకంటే రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయన్న ఆరోపణల నుంచి కేంద్రం బయటపడాలంటే మరణశిక్ష పడిన ఇతర దోషుల విషయంలో సమాధానమివ్వాలన్నారు. అఫ్జల్ కుటుంబానికి అథని ఉరి అమలు విషయాన్ని పోస్టులో పంపటమేమిటన్నారు. యూపిఏ వైఖరిని తాము నిరసిస్తున్నప్పటికీ... ఆ కూటమి నుండి బయటకు వస్తే అఫ్జల్ తిరిగొస్తారా? అతని కుటుంబ సభ్యులకు దగ్గర కాగలమా? అని ప్రశ్నించారు. కూటమిని కాదంటే జరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, వరుసగా రెండో రోజు కూడా కాశ్మీరులో కర్ఫ్యూ కొనసాగింది. గురుకు ఉరి తర్వాత వ్యాలీలో జరిగిన అల్లర్లలో 23 మంది పోలీసులు సహా 36 మంది గాయపడ్డారు. కాశ్మీర్లో పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజుల పాటు దిన పత్రికలను ముద్రించవద్దని స్థానిక అధికారులు సూచించారు. అఫ్జల్ గురు ఉరిపై హక్కుల సంఘాలు స్పందించాయి. అఫ్జల్ను ఇప్పుడే ఎందుకు ఉరి తీశారన్న ప్రశ్నలు వస్తున్నాయని న్యూయార్క్కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణాసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ ప్రశ్నించారు.