ఐటి దాడులు: బండ్ల గణేష్ వెనక చిరంజీవి, బొత్స?
బండ్ల గణేష్ వెనక ఉన్న బడా నాయకులు ఎవరో స్పష్టం చేయాలని దాడి వీరభద్ర రావు డిమాండ్ చేశారు. బండ్ల గణేష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గణేష్కు అండగా ఉంటే విచారణ నిష్పాక్షికంగా ఎలా జరుగుతుందని ఆయన అడిగారు. బండ్ల గణేష్ పుట్టుకతో కోటీశ్వరుడు కారని, ఇంత డబ్బు గణేష్కు ఎలా వచ్చింతో తేలాలని ఆయన అన్నారు. ఇంత తక్కువ సమయంలో కోట్లాది రూపాయలు గణేష్ ఎలా సంపాదించారని ఆయన అడిగారు.
రెండు రోజుల పాటు 12 మంది ఐటి అధికారులు నిర్వహించిన సోదాల్లో బండ్ల గణేష్ నివాసంలో, కార్యాలయంలో కీలకమైన పత్రాలు లభించినట్లు కూడా ప్రచారం సాగుతోంది. సినిమాల్లో హాస్య పాత్రలు వేస్తూ వచ్చిన బండ్ల గణేష్ బడా నిర్మాతగా మారిపోయాడు. నిర్మాతగా ఆయన రవితేజ హీరోగా 16కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇదే ఆయన తొలి సినిమా. తాము హత్య చేసినా బొత్స సత్యనారాయణ తనకు అండగా నిలబడుతారని గతంలో ఏ సినిమా కార్యక్రమంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం బండ్ల గణేష్ భారీ సినిమాలు వరుసగా నిర్మిస్తుండడమే ఐటి అధికారుల కన్ను పడడానికి కారణమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమా తీసిన బండ్ల గణేష్ నష్టాలనే చవి చూశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఆయనకు పెద్ద ఊపును ఇచ్చింది. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాద్షా సినిమాను, అల్లు అర్జున్ హీరోగా ఇద్దరు అమ్మాయిలతో సినిమాను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్తో మరో సినిమాను కూడా తీయడానికి గణేష్ ఏర్పాట్లు చేసుకున్నారు.
బండ్ల గణేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా సాగించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడితో కలిసి పెద్ద పౌల్ట్రీ పారం నడిపిస్తున్నాడని, మరో నేతతో కూడా పౌల్ట్రీ ఫారం నడుపుతున్నాడని చెబుతున్నారు. రాబోయే సినిమాలకు ఇచ్చిన అడ్వాన్సులు, పెట్టిన ఖర్చుల విషయంలో ఐటి అధికారులు బండ్ల గణేష్ నుంచి సమాచారం రాబట్టినట్లు చెబుతున్నారు.
కాంగ్రెసుతో జగన్ పార్టీ కుమ్మక్కు
సహకార ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. సహకార ఎన్నికల్లో పోటీ చేయబోమని మొదట ప్రకటించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ తర్వాత పోటీ చేసి, ఇప్పుడు మూడు జిల్లాల డిసిసిబి ఎన్నికల్లో పోటీ చేస్తామని అంటూ పొంతన లేకుండా మాట్లాడుతోందని ఆయన అన్నారు.
కాంగ్రెసుతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ విధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తాము కాంగ్రెసుతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే అన్ని జిల్లాల్లో పోటీ చేయాలి లేదా పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలు నడుపుతోందని ఆయన అన్నారు.
పవిత్రమైన సహకార సంఘాల వ్యవస్థను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ఆయన విమర్శించారు. బోగస్ ఎన్నికలు నిర్వహించిన ఘనత కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై కోడిగుడ్ల దాడి చేసింది వైయస్సార్ కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.