సంపూర్ణ వద్ద బ్యాగ్లో బాంబు: ఉద్యోగానికి వచ్చి..
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో అమాయకులు మరణించారు. గురువారం సాయంత్రం జరిగిన బాంబు పేలుళ్లలో ఎస్సై ఉద్యోగం కోసం వచ్చి శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విజయ్, రాజశేఖర్ దిల్షుక్ నగర్లో గది అద్దెకు తీసుకుని ఎస్సై ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లో చేరి చదువుకుంటున్నారు. స్థానిక టిఫిన్ సెంటర్లో అల్పాహారం చేసేందుకు వచ్చిన వారు బాంబు పేలుళ్లలో మృతి చెందారు.
కాగా, హైదరాబాదులోని సంపూర్ణ థియేటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ సంచీ కనిపించింది. ఆ సంచీలో బాంబు పెట్టినట్లు పోలీసులు గుర్తించి, దాన్ని నిర్వీర్యం చేశారు. బాంబు పేలుళ్ల జరిగిన రెండు ప్రదేశాల్లో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. సంఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
మృతి చెందినవారిలో మహ్మద్ రఫీక్ (పటాన్చెరు), అండాలు (సంజీవ్గాంధీ నగర్), పెబ్బె విజయకుమార్ (ఆదిలాబాద్), ఇజాక్ రఫీ(కవాడి గూడ), రవి (బోరబండ), యాదయ్య (చంపాపేట),వాలే రాములు(జీహెఎంసీ ఉద్యోగి), ముత్యాల రాజశేఖర్ (ఎంబీఎ), అహ్మద్ (పాలిటెక్నిక్ స్టూడెంట్- వారాసిగూడ) ఉన్నారు.మరణించినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుభూతి తెలియజేశారు.
సంఘటనకు పాల్పడినవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పేలుళ్లకు బాధ్యులెవరనే విషయంపై ఆయన మాట్లాడడానికి నిరాకరించారు.
ఇదిలావుంటే, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని గ్రూపులకు చెందిన తగినంత రక్తం అందుబాటులో ఉందని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (బ్లడ్ సేఫ్టీ), సంయుక్త సంచాలకులు డాక్టర్ సుజాత ఓ ప్రకటనలో తెలిపారు.