22న బిజెపి బంద్: రెండు రోజుల ముందే హెచ్చరికలు
హైదరాబాద్: భారత్లో ఉగ్రవాదదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా భారత్లోని తన పౌరులను రెండు రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. నిర్ధిష్టంగా ఎక్కడ దాడులు జరుగుతాయనే అంశంపై స్పష్టంగా చెప్పలేదు. కానీ భారత్లోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా జనసమ్మర్ధం ఉండే రైల్వేస్టేషన్లు, రైళ్ళు, లగ్జరీ హోటళ్ళు, మార్కెట్లు, సినిమా హాళ్ళు - ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో దాడులకు అవకాశం ఉందని తెలిపింది.
ఉగ్రవాద సంస్థలు హర్కత్ ఉల్ జిహాద్ ఈ ఇస్లామీ, హర్కత్ ఉల్ ముజాహిదీన్, ఇండియన్ ముజాహిదీన్, జైష్ ఏ మొహ్మద్, లష్కరే తొయిబా తదితర సంస్థలు దాడులకు తెగబడే అవకాశం ఉందని చెప్పింది. అమెరికా తన పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన రెండు రోజుల్లోనే హైదరాబాద్లో వరస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకోవటం గమనించాల్సి ఉంది.

ఇదిలావుంటే, పేలుళ్లు జరగవచ్చునని రెండు రెండు రోజుల నుంచి తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. గురువారంనాడు తాము హెచ్చరించామని, మరోసారి గురువారం ఉదయం కూడా గుర్తు చేశామని ఆయన అన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి ఆ హెచ్చరికలు అంత నిర్దిష్టంగా రాలేదని అంటున్నారు.
దాడులు జరగవచ్చునని కేంద్ర హోం శాఖ నుంచి రెండు రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చాయట కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాలకూ అటువంటి సమాచారం వస్తుందని, అలాగే మనకి కూడా వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. డిజిపి కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో మాట్లాడారు.
హైదరాబాద్ నగరవాసులు ఏ విధమైన భయాందోళనలకు గురి కాద్దని డిజిపి సూచించారు. నగరమంతా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. నగరంలోని ఏడు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు చోట్ల సైకిళ్లకు బాక్స్లో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలు అమర్చినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర బంద్కు బిజెపి పిలుపు
దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్లకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్కు బిజెపి పిలుపునిచ్చింది. బాంబు పేలుళ్లకు నిరసనగా శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించాలని బిజెపి నాయకులు ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications