దిల్షుక్నగర్లో మూడు భారీ పేలుళ్లు: 15 మంది మృతి

గాయపడినవారిని కొత్తపేటలోని ఓమ్మీ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా, యశోద ఆస్పత్రులకు కూడా గాయపడినవారిని చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనతో రాష్ట్రమంతా హై అలర్ట్ ప్రకటించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో కార్యాలయాల నుంచి అందరూ ఇక్కడికి చేరుకునే సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి.
పేలుళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్వేగవాతావరణం చోటు చేసుకుంది. కీలక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. దిల్షుక్ నగర్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కోణార్క్ థియేటర్ వద్ద ఓ హీరోహోండా బైక్లో బాంబు పేలినట్లు వార్తలు వస్తున్నాయి. సిసి కెమెరాల ద్వారా దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాంబు పేలుళ్లుగానే చెబుతున్నారు. ప్రధాన నగరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు పేలుళ్లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా పేలుళ్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పేలుళ్లు సంభవించిన రెండు ప్రాంతాలు కూడా నిరంతరం రద్దీగా ఉంటాయి. పైగా, సాయంత్రం ప్రజలు ఆఫీసు నుంచి తిరిగి వచ్చే సమయం కావడంతో మరింత రద్దీగా ఉన్నాయి. పేలుళ్లు సంభవించగానే భయాందోళనలకు గురైన ప్రజలు పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. రాజధానిలోని కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పేలుళ్ల సంఘటనపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆ హీరో హోండా ఎవరిది...
కోణార్క్ థియేటర్ వద్ద టిఫిన్ బాక్స్లో హీరో హోండాకు అమర్చిన బాంబు పేలినట్లు చెబుతున్నారు. ఆ హీరో హోండా బైక్ యాదయ్య గౌడ్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురిని గుర్తించారు. యాదయ్య, రంజిత్, రవి అనే ముగ్గురు వ్యక్తులు మరణించినవారిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఐదుగురు విదేశీయులు కూడా ఆ పేలుళ్లలో గాయపడినట్లు తెలుస్తోంది. యాదయ్య, రంజిత్ చంపాపేటకు చెందినవారని, రవి బోరబండకు చెందినవాడని చెబుతున్నారు.
పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ ఉరితీతకు ప్రతీకారంగా హైదరాబాదు, బెంగళూర్ నగరాల్లో పేలుళ్లకు పాల్పడుతామని గతంలో లష్కరే తోయిబా నేత మహ్మద్ ప్రకటించాడు. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ హైదరాబాదులో పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి.
సిసి కెమెరా ఫుటేజ్ కీలకం
పేలుడు దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయినట్లు సమాచారం. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుళ్ల ధాటికి అది చేడిపోయిందా, లేదా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ పేలుళ్లకు సంబంధించి సిసి కెమెరా ఫుటేజ్ కీలకమైన ఆధారాలను అందించగలదని భావిస్తున్నారు.
హెల్ప్లైన్:04027854771












Click it and Unblock the Notifications