మనీలాండరింగ్, మహిళలపై దృష్టి: ప్రణబ్, ఎపికి ఇవి...
రాయితీలు, ఇతర సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా కేంద్రం చర్యలు చేపట్టిందని రాష్ట్రపతి అన్నారు. పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. నగదు బదలితో ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా అవుతుందన్నారు. ప్రపంచ దేశాలతో పాటు మన దేశం పైనా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందన్నారు. ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు.
ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోందన్నారు. ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యగానే ఉందన్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతిని సాధిస్తున్నామని చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 87 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామన్నారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని రూ.40 వేల నుండి రూ.70 వేలకు పెంచినట్లు చెప్పారు.జెఎన్ఎన్ఆర్ఎంయును 2014 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తిలో స్వావలంభన కోసం 100 లక్షల కోట్ల టన్నుల
యూరియా ఉత్పత్తికి ప్రణాళిక రచించినట్లు చెప్పారు. అసంఘటిత కార్మికుల కోసం జాతీయ ఆరోగ్య భీమా పథకం ఏర్పాటు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఆరు ఔషధ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 2,600 కిలోమీటర్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. హైదరాబాదు సహా ఆరు ప్రాంతాల్లో ఔషధ పరిశోధన కేంద్రాలు నెలకొల్పుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్, కోల్కతాలలో ఓడ రేవులను నిర్మిస్తామన్నారు. 2014 నాటికి రెండున్నర లక్షల గ్రామాల్లో బ్రాడ్ బాండు సౌకర్యం అందిస్తామన్నారు. ఉన్నత విధ్య అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. ఉత్పాదక రంగంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబయిలో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రక్షణ పరిశోధన రంగంలో కొత్త ఆవిష్కరణల ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో 42 ఓడ రేవుల నిర్మాణం జరుగుతుందని, 12వ పంచవర్ష ప్రణాళికలో 88,500 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి జరుపుతామన్నారు. భారత టెలికాం రంగం ప్రపంచంలో రెండోదని చెప్పారు. త్వరలో 1.30 తపాలా కార్యాలయాలకు కంప్యూటర్లు అందిస్తామని, జిల్లా, గ్రామీణస్థాయిలో క్రీడాకారుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పథకం రూపొందిస్తామన్నారు.
చేనేత కార్మికులకు అండగా నిలబడుతామన్నారు. దేశ సరిహద్దు భద్రత పైన సైన్యం అప్రమత్తంగా ఉందని, సమస్యాత్మక 34 రాష్ట్రాల్లో రూ.7,300 కోట్లతో 2014 నాటికి రహదారులు నిర్మిస్తామన్నారు. తూర్పు-పశ్చిమ కోస్తాలను కలుపుతూ ప్రత్యేక సరుకు రవాణా రైలు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శ్రీలంకలోని తమిళుల పునరావాస, హక్కుల పరిరక్షణకు నిబద్ధతతో ఉన్నామన్నారు.
రాయబరేలీలో స్టెయిన్ లెస్ స్టీలు కోచ్ ఫ్యాక్టరీను నిర్మిస్తామన్నారు. వేగంగా పాసుపోర్టులను అందించే చర్యలు చేపడతామన్నారు. పశ్చిమ కనుమలలోని కోయినాలో భూకంప అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. 2020 నాటికి అన్ని గ్రామాలలో రక్షిత భద్రత నీటిని సరఫరా చేస్తామన్నారు.
మహిళల భద్రతపై దృష్టి
మహిళల భద్రత పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మహిళల విషయంలో జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం రూపొందిస్తున్నట్లు చెప్పారు. నర్సుల కొరతను తీర్చేందుకు దేశంలో 200 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రవేశపెడతామన్నారు.
మనీ లాండరింగ్ చట్టం
మనీలాండరింగ్ చట్టానికి మరింత పదును పెడతామన్నారు. దేశీయ మారక ద్రవ్య అక్రమ తరలింపు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో..
ఆంధ్రప్రదేశ్లో కొత్త ఓడ రేవుల నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. వెయ్యి మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఓడ రేవు నిర్మాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ సహా ఆరు ప్రాంతాల్లో ఔషధ పరిశోధన కేంద్రాలు నెలకొల్పుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రెండు ఉత్పాదక మండళ్లు.