నీటి గుంటలో పడి విద్యార్థి మృతి: నీరులేక వంట బంద్
నిర్మాణ పనుల కోసం తవ్విన గుంత లోతుగా ఉండటంతో మల్లేష్ నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు అతనిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, ఈత రాకపోవడంతో మల్లేష్ నీటి గుంటలో మునిగి మృతి చెందాడు. సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామని, అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
సికింద్రాబాదులోని మహాత్మా గాంధీ రోడ్డులో నిత్యం తమకు ఛలాన్లు రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన లగేజీ ఆటో డ్రైవర్లు ఈ రోజు ఘెరావ్ చేశారు. లగేజీ ఆటోల్లో సామాగ్రి తీసుకు వెళ్తే తప్పేమిటని నిలదీశారు. ఆటోలను నిత్యం ఆపుతూ ట్రాఫిక్ సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాగునీరు లేక వంట బంద్
తాగు నీరు లేకపోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ హాస్టల్లో వంట వండక పోవడంతో విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. జిల్లాలోని తాండూరు మండలం కస్తూర్భా పాఠశాలలో నీరు లేక పోవడంతో సిబ్బంది ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం వండలేదు.
ఉదయం నుండి ఎలాంటి తిండి లేకపోవడంతో పదిమంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నీరు లేకుంటే తీసుకు వచ్చి వండాల్సింది పోయి పిల్లలను పస్తులు ఉంచడంపై స్థానికులు మండిపడ్డారు. మరోవైపు నీటి సరఫరా అందించని అధికారులపై ఆగ్రహం వెళ్లగక్కారు.
కర్నూలులో ఈవ్ టీజర్కు దేహశుద్ది
కర్నూలు జిల్లాలో ఓ ఈవ్ టీజర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. తనను ప్రేమించకపోతే కిడ్నాప్ చేస్తానని కర్నూలులోని కృష్ణానగర్కు చెందిన యువకుడు ఓ యువతిని బెదిరించాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి నాలుగో పట్టణ పోలీసు స్టేషన్లో అప్పగించారు.