బాబ్లీ టార్గెట్: కెసిఆర్ను టిడిపి, బాబును జగన్ పార్టీ
కరీంనగర్లో జరిగిన తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించారు. కెసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తెరాస వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కెకె మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తప్పు పట్టారు.
గోదావరి నదిపై మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు పాపం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదేనని ఆయన అన్నారు. అంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన చంద్రబాబుపై, తెలుగుదేశం నాయకులపై శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కూల్చివేత కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన కోరారు. రాజకీయ ప్రయోజనం కోసమే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
కాగా, తెరాస ఒక్క అడుగు ముందుకేసి అటు వైయస్ రాజశేఖర రెడ్డిని, ఇటు చంద్రబాబును తప్పు పడుతోంది. చంద్రన్న, రాజన్న రాజ్యాల నిర్లక్ష్య ఫలితమే తెలంగాణకు బాబ్లీ కుంపటి అని తెరాస శాసనసభ్యుడు కెటి రామరావు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లి ప్రధానికి పరిస్థితి తీవ్రతను వివరించాలని ఆయన కోరారు ప్రభుత్వం స్పందించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
కాగా, బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పు వల్ల మన రాష్ట్రానికి ఏ విధమైన నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సుప్రీంతీర్పు అన్యాయంగా ఏమీ లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన నీటి పారుదల శాఖ మంత్రి సుదర్సన్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేసి రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టవద్దని ఆయన సూచించారు. శ్రీరాంసాగర్ ముంపు బాధితులకు మహారాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని చెప్పారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశశ్ సంయుక్తంగా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.