డబుల్ గేమ్!: రంగంలోకి బాలకృష్ణ, షర్మిల

Balakrishna - Sharmila
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణలు ఆయా పార్టీలలో ఇక ముందు రెండో పవర్ సెంటర్‌గా మారనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. బాలయ్య వల్ల చంద్రబాబుకు, షర్మిల వల్ల జగన్‌కు సమీప భవిష్యత్తులో ఇక్కట్లు రావని చెప్పలేమని అంటున్నారు.

గతేడాది మే 27న జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కావడంతో తప్పని పరిస్థితుల్లో పార్టీ బలోపేతం కోసం షర్మిల బయటకు వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మరో ప్రజా ప్రస్థానం పేరిట పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్నారు. అయితే, ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలోనే ఆమె కన్ను ముఖ్యమంత్రి పీఠంపై పడిందని, ఆమె పార్టీలో తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

షర్మిల పార్టీలో రెండో పవర్ సెంటర్‌గా మారుతున్నందు వల్లే జగన్ సాక్షిలో షర్మిల పాదయాత్రకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఆమె పాదయాత్రకు కూడా ఫుల్ స్టాప్ పెట్టించాలని చూశారని అన్నారు. అయితే, ఈ వాదనలన్నింటిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొట్టిపారేసింది. షర్మిల కూడా వాటిపై ధీటుగానే స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, షర్మిల ముందు ముందు పార్టీలో పవర్ సెంటర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

రాజకీయాలపై ఆమె ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. కడప పార్లమెంటు స్థానం పైన ఆమె దృష్టి సారిస్తుందనే ప్రచారం జరగడం, దీనిని జగన్ తన సోదరుడికి ఇస్తానని మాట ఇవ్వడంపై షర్మిల అసంతృప్తి చెందినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కడప స్థానానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని కూడా దాదాపు ప్రకటించిందనే చెప్పవచ్చు. ఇది షర్మిలకు అసంతృప్తిని మిగిలించిందట. జగన్‌కు అండగా నిలుస్తూనే షర్మిల పార్టీలో తన వర్గాన్ని తయారు చేసుకునే పనిలో పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

జగన్ బయటకు వచ్చాక షర్మిల ఇంటికే పరిమితం అవుతారని మొదట వార్తలు వచ్చినా ఆ తర్వాత ఆమె రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారని దీంతో, ఏదో ఒక స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కూడా సిద్ధమవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో టిడిపిలోను బాలయ్య రెండో పవర్ సెంటర్‌గా మారతున్నారట. బాలయ్య రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించక ముందు నుండే ఆయన రెండో పవర్ సెంటర్‌గా మారుతారనే వార్తలు వచ్చాయి.

గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో బాలయ్య పట్టుబట్టి పలువురికి టిక్కెట్ ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ఆశావహులు బాబుతో పాటు బాలయ్య వద్దకు కూడా క్యూ కట్టారట. బాలయ్యకు సన్నిహితంగా ఉండే పలువురు ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. బాబుపై పలుమార్లు ఒత్తిడి తెచ్చి బాలయ్య సీటు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి కారణంగా కొడాలి నానికి చంద్రబాబు అప్పుడు టిక్కెట్ ఇచ్చారు. అల్లుడి నుండే అంత ఒత్తిడి ఉంటే బావమరిది నుండి ఇంకెంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. బాలయ్య రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేస్తేనే ఆశావహులు ఇంతగా క్యూ కడుతుంటే 2014 ఎన్నికలకు ఇది మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో జగన్‌తో పాటు షర్మిల, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో పాటు బాలయ్య పవర్ సెంటర్‌లుగా మారే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+