వేర్పాటవాదానికి పేలుళ్లకు లింక్ పెట్టిన లగడపాటి
వేర్పాటు వాదం ఎంత వయొలెంట్గా ఉంటుందో సమైక్యవాదం అంత సైలెంటుగా ఉంటుందని, ఆ నిశ్శబ్దం ఎంత బలమైందో అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుందని చెప్పారు. మన బంధం భారతీయత అని, అనుబంధం తెలుగు భాష అని, ఈ అనుబంధంతో చక్కని రాష్ట్రం ఏర్పాటు చేసుకుని దేశం గర్వపడే స్థాయిలో అభివృద్ధి చేసుకోగలిగామని కానీ, కొంతమంది స్వార్ధపరులు వేర్పాటువాదం ముసుగులో అరాచకాలు సృష్టిస్తూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన జరుగుతుందన్న సమాచారం రాగానే సమైక్య ఉద్యమం ఉవ్వెతున్న కెరటంలా ముందుకొస్తుందన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు అని ఎవరైనా అంటే మా అమ్మ సొత్తు అని బదులివ్వాలన్నారు. రాష్ట్రంలోని 8 కోట్ల జనాభాలో అత్యధికులు సమైక్యానికే మొగ్గు చూపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు.
బిజెపి, సిపిఐ, టిడిపిలు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి తీర్మానాలను పంపాయని, సమైక్య ఉద్యమం చూశాక వారి గొంతులు మూగబోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా 294 స్థానాల్లో 270 స్థానాల్లో సమైక్యవాదం గెలుస్తుందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు జాతి మనది, తెలుగు నాడు మనది అని ఎలుగెత్తి చాటారన్నారు. వేర్పాటువాద ఉద్యమం చల్లబడటంతో వేర్పాటువాదులు, స్వార్థపూరిత శక్తులు తోకముడిచాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.