చంద్రబాబు పాదయాత్రలో జూ ఎన్టీఆర్: ఆసక్తి, సస్పెన్స్
2014లో టిడిపిని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన హీరో, పార్టీ నేత నందమూరి బాలకృష్ణ రెండు రోజుల క్రితం పాల్గొన్నారు. బాబుతో పాటు అడుగు కలిపారు. బాబుతో తరుచూ విబేధించే రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పాదయాత్ర ప్రారంభానికి ముందే హిందూపురం చేరుకొని యాత్రకు అంతా సిద్ధం చేశారు. బాబుతో కలిసి కొద్ది దూరం నడిచారు.
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం పలుమార్లు పాదయాత్రలో మెరిశారు. భువనేశ్వరి రెండుమూడుసార్లు కనిపించారు. బ్రాహ్మిణి వరంగల్ జిల్లాలో బాబును పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో వేదిక కూలినప్పుడు బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు బాబును స్వయంగా కలిశారు. అందరి మాట అటుంచితే పాదయాత్ర ప్రారంభమైన సమయంలో బాలయ్య, జూనియర్లు ఓసారి బాబు యాత్రలో పాల్గొంటారనే వార్తలు వచ్చాయి.
కర్నూలులో బాలయ్య, మహబూబ్ నగర్లో జూనియర్ అడుగులో అడుగేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. బాలయ్య రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాలో బాబు యాత్రలో అర్దరాత్రి వరకు నడిచారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు బాబు యాత్రలో పాల్గొనలేదు. జూనియర్ సైతం స్వయంగా తాను అవకాశం చిక్కినప్పుడు పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. బాబు యాత్ర షెడ్యూల్ పెరుగుతున్నప్పటికీ జూనియర్ పాల్గొనలేదు. ఎన్టీఆర్ పాల్గొనడంపై కార్యకర్తల్లో ఆసక్తితో పాటు సస్పెన్స్ కొనసాగుతోందట.