రేపు పోలవరం ప్రాజెక్టుకు ముహూర్తం!: కిరణ్ గైర్హాజరు
రేపు ఉదయం ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించనున్నారట. అయితే, ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభ్యుల కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికల అభ్యర్థుల లిస్ట్ కోసం ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. మరోవైపు ప్రాజెక్టుపై కొందరి వ్యతిరేకత నేపథ్యంలో రేపు ఉదయం రైతులు మాత్రమే భూమి పూజ చేసి పనులు ప్రారంభించనున్నారనే వార్తలు వస్తున్నాయి.
కాగా, పోలవరం ప్రాజెక్టు కట్టడంపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెసు ఖాతాలో మరో అతిపెద్ద కుంభకోణం పోలవరం ప్రాజెక్టు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి నిన్న ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రూ.75వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు.
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పోలవరం టెండర్లను ట్రాన్స్ట్రాయ్కు అప్పగించారని కిషన్ రెడ్డి అన్నారు. యూపిఏ2 ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ట్రాన్స్ట్రాయ్ బోగస్ కంపెనీ అని తేలినా టెండర్లను అప్పగించారని విమర్శించారు. పోలవరం టెండర్లపై సిబిఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగామ రాష్ట్ర సమితి కూడా ఈ ప్రాజెక్టు విషయంపై మండిపడుతోంది.