కొండా సురేఖకు వైయస్ జగన్ మొండిచేయి?
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉండటం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన తెలంగాణ వ్యతిరేక ముద్ర పడిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా బలమైన నేత, జగన్ కోసం పదవులను త్యాగం చేసిన కొండా దంపతులకు ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ, ఆ పార్టీ బుధవారం నాడు అప్పారావును ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.
దీంతో కొండా సురేఖకు జగన్ చేయిచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొండా దంపతులు శాసనమండలి స్థానం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కూడా చెబుతున్నారు. వారికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తారనేది కేవలం ప్రచారమేనని, అటు జగన్ గానీ, ఇటు కొండా దంపతులు కానీ దానిపై మాట్లాడుకోలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు జగన్ వారికి ప్రాధాన్యం ఇవ్వలేదనే వ్యాఖ్యల్లో ఎలాంటి అర్థం లేదని చెబుతున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండో అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రానట్లుగా చెబుతున్నారు. పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలతో పాటు టిడిపి, కాంగ్రెసు గూటి నుండి తమ వైపు వచ్చిన ఎమ్మెల్యేలను కలుపుకుంటే సులభంగా ఒక అభ్యర్థిని గెలిపించుకోవచ్చు. ఆ టిక్కెట్ను పార్టీ ఇప్పటికే అప్పారావుకు కేటాయించింది. రెండో టిక్కెట్ పైన పార్టీ తర్జన భర్జన పడుతోందట. ఎమ్మెల్సీ ఎన్నికలకు విప్ ఉండదు. ఈ నేపథ్యంలో తాము రెండో అభ్యర్థిని నిలబెడితే ఎంతమంది కలిసి వస్తారనే విషయమై పార్టీలో చర్చ సాగుతోందట.