కిరణ్కు ఆటవిడుపు: అవిశ్వాసంపై మూడు ముక్కలాట
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిపక్షాల మధ్య అనైక్యతే వరంగా మారుతోంది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి రావడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధంగా లేరు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గానీ ప్రతిపాదించే అవిశ్వాసానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేరు.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెసు, తెరాస తీవ్రమైన వ్యాఖ్యలు చేశాయి. కాంగ్రెసు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడే కాపాడుతున్నారని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శించారు. కాగా, ఓ వైపు అవిశ్వాస తీర్మానానికి రేపు గురువారం తెరాస నోటీసు ఇవ్వబోతోంది. ఇదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా నోటీసు ఇస్తోంది.
తమ పార్టీలను చంద్రబాబు తోకపార్టీలుగా అభివర్ణించడంపై వైయస్సార్ కాంగ్రెసు, తెరాస నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ తన బాధ్యతను విస్మరిస్తున్నారని వారంటున్నారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసునని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని తెర మీదికి తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పావులు కదుపుతున్నాయి. అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే 30 మంది శానససభ్యుల మద్దతు అవసరం. ఈ సంఖ్య కోసం తెరాస ప్రయత్నాలు సాగిస్తోంది. సిపిఐ, సిపిఎం, లోకసత్తా, బిజెపిల మద్దతును కోరింది. నాగం జనార్దన్ రెడ్డి తెరాస ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే విమర్శలను ప్రజలు నమ్ముతారా అనేది అనుమానంగానే ఉంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము మద్దతు ఇస్తామని ఆ రెండు పార్టీలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన తర్వాత ఆ రెండు పార్టీలు మద్దతు ఇచ్చే విషయంలో తప్పుడు ధోరణులు అవలంబిస్తే వాటిని ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీకి వీలుంటుంది. కానీ ఈ విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టడంలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే స్థితిలో అవిశ్వాసం ప్రతిపాదించకుండా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు పనిచేస్తున్నారనే ఆ రెండు పార్టీల విమర్శలే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications