టిడిపి విప్ జారీ: పెద్దిరెడ్డి రిజైన్ వెనక్కి, అవిశ్వాసానికే..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు
అవిశ్వాస తీర్మానంపై ఓటింగు జరిగితే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని పుంగనూరు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ.. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు స్పీకర్కు తెలిపానని, అవిశ్వాసంలో కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని చెప్పారు. అనంతరం ఆయన స్పీకర్ను కలిసి రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.
అంతకుముందు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. బుధవారం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి దారిలోనే సుజయ కృష్ణ రంగారావు నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
వాయిదాల సభగా మారింది
సభ వాయిదాల సభగా మారిందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. సభ పైన ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. వాయిదాల పరం మళ్లీ మొదలయిందన్నారు. దేశంలో రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే విద్యుత్ కొరత ఉందన్నారు. అవిశ్వాసానికి టిడిపి కలిసి వస్తే కిరణ్ ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు అవుతాయన్నారు. అవిశ్వాసంపై చర్చకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేమిటని గుండా మల్లేష్ ప్రశ్నించారు.