చంద్రబాబు కాపాడుతారు, పక్కా సమాచారం: బొత్స
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల అవిశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని బొత్స సత్యనారాయణ గురువారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని పక్కా సమాచారం ఉందని ఆయన చెప్పారు.
తమ కాంగ్రెస్ శాసనసభ్యులు కొందరు ధిక్కరించినా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. తెరాస తీర్మానానికి 30 మంది సభ్యుల మద్దతు ఉందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజీనామాను ఎందుకు ఉపసంహరించుకున్నట్లు అని ఆయన ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాల కోసమా అని గండ్ర ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి తన శానససభా సభ్యత్వానికి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం తన రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తానని కూడా ఆయన చెప్పారు.