కేసులతో మజ్లీస్ దూరం: చంద్రబాబు డైలమా కింకర్తవ్యం
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మజ్లీస్ పార్టీని కోరింది. అయితే, శుక్రవారం అవిశ్వాస తీర్మానం నోటీసుకు మద్దతుగా మజ్లీస్ పార్టీ సభ్యులు లేచి నిలబడలేదు. దీన్ని బట్టి అవిశ్వాస తీర్మానానికి మజ్లీస్ సహకరించే అవకాశం లేనట్లు అర్థమవుతోంది. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మజ్లీస్ శానససభా పక్ష నేత అసదుద్దీన్ ఓవైసీపైనే కాకుండా పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇతర శాసనసభ్యులపై, నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయడానికి సిద్దమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు మజ్లీస్ సిద్ధంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి.
కాగా, తోకపార్టీలకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని చెప్పిన తెలుగుదేశం పార్టీ అది చర్చకు వస్తుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాలా, వద్దా అనే విషయంపై ఆ పార్టీ ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. కాంగ్రెసుతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని తెరాసతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీలు మరింతగా దాడిని పెంచే అవకాశాలున్నాయి.
ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాలా వద్దా అనే విషయాన్ని తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు పాదయాత్రలో ఉన్న చంద్రబాబును సంప్రదిస్తున్నారు. తమ పార్టీ శాసనసభ్యులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొని దానికి అనుకూలంగా ఓటేయకపోతే తెలుగుదేశం పార్టీ మరింతగా కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు లాలూచీ కోసం, తెరాస బ్లాక్ మెయిల్ కోసం తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించబోమని, తోక పార్టీలకు మద్దతు ఇవ్వబోమని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిస్సహాయతలో పడినట్లే కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా అది నిర్వహించే పాత్ర ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.