రాజీనామా చేస్తా: జెపి, మీరే మేధావి కాదు: సిఎం
డబ్బుకు ఓట్లేస్తారనే వ్యాఖ్యలతో జెపి ప్రజలను అవమానిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జెపి ఒక్కరికే తెలివి ఉందా, ఇంకెవరికీ లేదా అని ఆయన అడిగారు. ప్రజల తీర్పును శంకించడం సరైందేనా అని ఆయన అడిగారు. ముఖ్యమంత్రి మాటలపై జెపి తీవ్రంగా ప్రతిస్పందించారు. జనాలను పేదలను చేసే పథకాలు ఎందుకంటే మీకు ఉలుకెందుకని ఆయన అడిగారు. ఎన్నికల్లో తాను ఒక్క రూపాయి ఇచ్చినట్లు రుజువు చేసినా తాను రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో దోషి కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీని అనుకరించాయని ఆయన అన్నారు. సంఖ్యాబలం ఉన్నా తెలంగాణ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని అడిగారు. ఓట్ల కోసమే తెలంగాణ అంశంపై నాన్చివేత ధోరణి అవలంబిస్తన్నారని ఆయన అన్నారు.
ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నామని ఆయన అన్నారు. మీకు అధికారం ఉంటే సరిపోతుందా, రాష్టానికి పరిశ్రమలు, ఉపాధి అవసరం లేదా అని ఆయన అడిగారు. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని, మార్కెట్లు స్మశానాలుగా ఉన్నాయని ఆయన అన్నారు. సహకార ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారని ఆయన అన్నారు.
అవినీతిని అరికట్టడానికి సమగ్ర చట్టం తేవాలని, ఎసిబి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని ఆయన సూచించారు. రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని అంధకారంలో ముంచారని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధుల్లో అధికార కాంక్ష పెరిగిందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థి 5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని, ఇటీవలి ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి సగటున 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని ఆయన చెప్పారు. పార్టీలు, చట్టసభల సభ్యులు తీరు మార్చుకోకపోతే సంక్షోభం ముదురుతుందని ఆయన అన్నారు. శాసనసభను నిర్వీర్యం చేసింది కాంగ్రెసు పార్టీ కాదా అని ఆయన అడిగారు. అధికారమే లక్ష్యంగా కొనసాగితే రాష్ట్రం అధోగతి పాలవుతుందని జెపి అన్నారు.