అవిశ్వాస తీర్మానంపై చర్చకు కిరణ్ రెడ్డి జవాబు

దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. బిక్షగాళ్లను చేస్తున్నారనే విమర్శ సరైంది కాదని లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి అన్నారు. 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. 8 కోట్ల 50 లక్షల కుటుంబాలకు అవి చేరుతున్నాయని ఆయన అన్నారు. ఆహార భద్రత కల్పించాలని తాము భావించామని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే సత్తా వారికి లేదని ఆయన అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసీలకు రిజర్వేషన్లు పెరుగుతున్నాయని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారా, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే చిరునామా గల్లంతవుతుందనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారా అని అడిగారు. రైతులకు మేలు చేయాలని తాము చర్యలు తీసుకుంటున్నామని, తమది రైతు ప్రభుత్వమని ఆయన అన్నారు. కాంగ్రెసుకు అధికారంలోకి రావాలన్న తొందర లేదు కాబట్టి తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవిశ్వాసం ప్రతిపాదించలేదని ఆయన అన్నారు. వరిధాన్యం క్వింటాల్ ధరను 590 రూపాయలు ఎన్డిఎ ప్రభుత్వ హయాంలో ఇస్తే ఇప్పుడు 1250 రూపాయలు ఇస్తున్నామని ఆయన అన్నారు. రైతు ధాన్యాన్ని మనమే కొని బియ్యం పట్టిస్తే రైతుకు ఎక్కువ ధర వస్తుందని ఏడు జిల్లాల్లో మన బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టామని, ఎగుమతికి అనుమతించడం వల్ల రైతుకు ఇంకా ఎక్కువ ధర ఇస్తున్నామని ఆయన అన్నారు. కోటి మంది రైతులకు వడ్డీ మాఫీని అమలలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నామని, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు నిధులు పెంచామని ఆయన చెప్పారు. చేపలు, రొయ్యలు పెంచే రైతుల నాలా చార్జీలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. ప్రజల వద్దకు ఎక్కువ వెళ్లాలని, ప్రభుత్వ కార్యక్రమాలు సరిగా అందుతున్నాయా లేదా చూసి అందిచేలా చూడడానికి రచ్చబండ పెట్టామని ముఖ్యమంత్రి ఇచ్చామని, రచ్చబండలలో ఇచ్చిన రేషన్ కార్డుల గురించి, ఇళ్ల గురించి చెప్పారు. ఇవేవీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారికి కనిపించడం లేదేమో అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
నిత్యావసర సరుకులు 107 రూపాయలకు తక్కువకు అందించే విధంగా కార్యక్రమం తీసుకుంటామని ఆయన చెప్పారు. రెవెన్యూ సదస్సులు పెద్ద యెత్తున పెట్టామని, ఆరు లక్షల 30 వేల పిటిషన్లు వచ్చాయని, 90 శాతం పిటిషన్లకు పరిష్కారాలు చూపామని ఆయన చెప్పారు. భూసమస్యలకు ఖర్చులు లేకుండా, తక్కువ ఖర్చు జరిగేలా అధికారులే ఇంటికి వెళ్లి పరిష్కారం చేస్తున్నారని ఆయన చెప్పారు. మైక్రో ఫైనాన్స్ వల్ల ఇబ్బందులున్నాయని తలచి బ్యాంక్ పెట్టి 1500 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ దేశంలో పెద్ద యెత్తున తేవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తాను అధికారంలోకి వచ్చే సరికి మహిళలకు రుణాలు రాలేదని, అసలు కడితే వడ్డీ తాము కడుతామని చెప్పామని, ఇది అమలు చేయడం లేదని, మధ్యవర్తులకు స్థానం లేకుండా చేశామని, అది కష్టంగా ఉందేమోనని ఆయన అన్నారు. కళ్లుండి చూడలేమని, చెవులుండి వినలేమని, నోరుండి మాట్లాడలేమని అనేవాళ్లను వదిలేస్తామని ఆయన చెప్పారు.
వివిధ వర్గాలకు ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఆయన వివరించారు. తాము అమలు చేస్తున్న కార్యక్రమాలు చూసి కడుపు మంటనా అని అడిగారు. తాము సంక్షేమ పథకాలను పెద్ద యెత్తున అమలు చేస్తున్నా కూడా అమలు జరగడం లేదని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన వైయస్సార్ కాంగ్రెసును ఉద్దేశించి అన్నారు. తాను చేపట్టిన ఇందిరమ్మ బాట గురించి ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాలో బీసిలకు కేటాయించిన నిధులను, తమ ప్రభుత్వం కేటాయించిన నిధులను పోల్చి చెప్పారు. వివిధ వర్గాలకు తాము కేటాయించిన నిధలను ఆయన వివరించారు.
క్రికెట్ ఆడితే కామెంట్: వాకింగ్ ఫ్రెండ్ రాలేదు
తాను ఇందిరమ్మ బాటలో బాగంగా గ్రామాలు తిరుగుతూ సంక్షేమ పాఠశాలల హాస్టళ్లలో పడుకున్నానని, తెల్లారి పిల్లలతో క్రికెట్ అడితే దానిపై వ్యాఖ్యలు చేశారని, పేద పిల్లల గురించి మీకు తెలియదని ఆయన అన్నారు. పిల్లలతో ముఖ్యమంత్రి క్రికెట్ ఆడాడనే ఉత్ససాహం నింపితే వారెంత సంతోషిస్తారో మీకు తెలియదని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాకింగ్ ఫ్రెండ్ వచ్చి ఎస్టీ, ఎస్సీల గురించి మాట్లాడుతారని అనుకున్నానని, వాకింగ్ చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. తమ ప్రాధాన్యం ఎస్సీ, ఎస్టీలని, చంద్రబాబుకు వాకింగ్ ప్రాధాన్యమని, ఎవరి ప్రాధాన్యాలు వారివని ముఖ్యమంత్రి అన్నారు.
రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్న ఒడిషాకు చంద్రబాబు వెళ్తారేమో తెలియదని, అక్కడ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారేమో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. 9 లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మెస్ చార్జీలు పెంచామని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఉంటే, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లించామని ఆయన అన్నారు. ఫీజులు చెల్లించడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారు అంటున్నారు కాబట్టి వారికి సమాధానం చెబుతున్నానని, 11 వేల కోట్ల పైచిలుకు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లించామని ఆయన అన్నారు.
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తెలిసి అవిశ్వాస తీర్మానం పెట్టారా, వాటిని అమలు చేస్తున్నారని పెట్టారా అని అడిగారు. ఇందిరమ్మ అమృతహస్తం పేర తక్కువ భారంతో పుట్టే వారికి సహాయం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.. ఒకటే సంవత్సరం 12 లక్షలు ఆపరేషన్లు చేశామని వైయస్సార్ కాంగ్రెసు మిత్రుడు చెప్పాడని, సత్యం చెప్పేవాడి కంట్లో కారం కొట్టాడని, ప్రజలకు నిజం చెప్పే అలవాటు చేసుకోవాలని, అసత్యాలు చెప్పడం మంచిదికాదని ఆయన అన్నారు.
ఆరోగ్యశ్రీ కింద రెండేళ్లలో 8 లక్షల ఆపరేషన్లు జరిగాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో40 శాతం ఆపరేషన్లు జరిగేలా చూస్తున్నామని ఆయన చెప్పారు. వైద్యులకు అదనంగా డబ్బులు వస్తాయని, ప్రభుత్వాస్పత్రులు మెరుగుపడుతాయని ఆయన అన్నారు. 108 ద్వారా 400 ఎమర్జెన్సీలు ఎక్కువగా అటెండ్ అవుతున్నట్లు ఆయన తెలిపారు. 108 సక్రమంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. దిల్షుక్నగర్ బాంబు పేలుళ్లలో గాయపడిన వారిని 15 నిమిషాల లోపే 108 వాహనాలు ఆస్పత్రులకు చేర్చాయని ముఖ్యమంత్రి చెప్ాపరు. 104 వాహనాలు కూడా బాగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.
జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 22 లక్షల ఎకరాలకు అదనంగా నీరిచ్చామని, 34 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లిస్తామని చెప్పారు. ఓ పద్ధతి ప్రకారం ఖర్చు చేస్తూ రైతులకు నీళ్లందించే పని చేస్తున్నామని ఆయన అన్నారు. డెల్టా ఆధునీకీకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తామని చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగలిగామని, 180 టిఎంసిలు వస్తాయని, వాటిని వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తామని ఆయన చెప్పారు. కొన్ని అనుమతులు రావాల్సి ఉందని, జాతీయ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని, 1947 - 48లోనే దీన్ని చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయని కిరణ్ రెడ్డి చెప్పారు. పోలవరం పూర్తయితే తెలంగాణ, రాయలసీమ కరువు ప్రాంతాలకు నీరు అందుతుందని చెప్పారు. గిరిజనేతరులకు నష్టపరిహారం రాదు కాబట్టి బాధపడుతున్నారని, ఎంత మంది గిరిజనేతరులు ఉన్నారో తమ వద్ద రికార్డు ఉందని ఆయన అన్నారు. పులిచింతల జూన్, జైలులో పూర్తి చేస్తామని, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే తుఫాను వచ్చినా రైతులకు ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు.
బాబ్లీపై అఖిలపక్షం
బాబ్లీ వల్ల నష్టం జరుగుతుందని అనుకుంటే మళ్లీ అపీల్కు వెళ్లడానికి అభ్యంతరం లేదని, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు ఇవ్వాలని, తీర్పు కాపీ వచ్చిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని, తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన అన్నారు.
విద్యుత్ సమస్య ఇబ్బందికరంగానే ఉందని, ఈ విషయాన్ని తాను ప్రజల ముందు పెడుతున్నానని ఆయన అన్నారు. జల విద్యుదుత్పత్తిపై, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తిపై ఆధారపడి ఉన్నామని, గ్యాస్ అందే పరిస్థితి లేదని ఆయన అన్నారు. గత 15 ఏళ్లలో లేనంత తక్కువ వర్షపాతం ఉందని, దీంతో జలవిద్యుదుత్పత్తిపై తీవ్రమైన ప్రభావం పడిందని ఆయన అన్నారు. విద్యుత్ కొరతను అధిగమించడానికి తీసుకున్న చర్యలను, తీసుకోబోయే చర్యలను వివరించారు. వీలైన చోట్ల పెద్ద యెత్తున సబ్సిడీలు ఇస్తామని చెప్పారు. ప్రపంచ మహాసభలకు పెద్ద యెత్తున అన్ని ప్రాంతాల నుంచి వచ్చారని, దేశంలోనే ఆదర్సవంతంగా ఉండే ప్రభుత్వం ఇది అని అన్నారు. కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఇటువంటి అవిశ్వాస తీర్మానం వల్ల తమపై విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications