పెళ్లి కూతురు పరార్: పెళ్లికి వచ్చిన అమ్మాయితో పెళ్లి
సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - తిరుముల్లైవాయల్కు చెందిన రాజా పట్టాభిరామ్ ఓ ప్రైవేటు సూపర్ మార్కెట్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనతోపాటు పనిచేస్తున్న ఓ అమ్మాయిని రాజా ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకునేందుకు మూహూర్తాలు కూడా పెట్టించాడు. బుధవారం ఉదయం పెళ్లి జరిపించటానికి భారీగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం రిసెప్షన్కు ఇతర బంధువులు, స్నేహితులు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో సాయంత్రం 7 గంటల నుంచి వధువు కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పలు ప్రాంతాలలో వధువు కోసం గాలించిన ఫలితం లేకపోయింది. దీంతో వధువు తరుపు బంధువులు, మిత్రులు నిరుత్సాహంతో పెళ్లి మంటపంలో దిగాలుపడ్డారు. కొన్ని గంటల్లో జరగాల్సిన పెళ్లి ఆగిపోవడంతో వరుడి తల్లిదండ్రులు తాము నిశ్చయించిన ముహూర్తంలోనే తమ కుమారుడికి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు.
పెళ్లికి వచ్చిన అతిథుల్లో తమ బంధువుల కుమార్తెను తమ కుమారుడ్ని చేసుకునేందుకు అడిగారు. అమ్మాయి ఓకే అనడంతో రాత్రికి రాత్రే అతిథిగా వచ్చిన నందిని అనే తమ బంధువుల అమ్మాయిని వధువుగా కూచోబెట్టేశారు. ఎట్టకేలకు ముందే నిర్ణయించిన ముహూర్తంలో బుధవారం ఉదయం రాజా, నందినీల వివాహం జరిగింది. పెళ్లి మండపం నుంచి పరారైన అమ్మాయి తల్లిదండ్రులు పట్టాభిరామ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తమ కుమార్తె ఆచూకీ కోసం గాలిస్తున్నారు.