జగన్ వర్గ ఎమ్మెల్యేలపై స్పీకర్కు గండ్ర ఫిర్యాదు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా కాంగ్రెసు పార్టీ జారీ చేసిన విప్ను వారు ధిక్కరించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశారు. దీంతో వారిపై వేటుకు గండ్ర వెంకటరమణా రెడ్డి, జగ్గా రెడ్డి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు అనుబంధ సభ్యుడు కూన శ్రీశైలం గౌడ్పై కూడా ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతు ఇస్తూ, ఆ పార్టీలో చేరడానికి సిద్ధపడిన 9 మంది శాసనసభ్యులపై వేటుకు చర్యలు చేపట్టేందుకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకున్నారు. వారిపై చర్యలకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అనుమతి ఇచ్చారు. సాధారణ ఎన్నికలకు ముందు ఉప ఎన్నికలను ఎదుర్కుని వైయస్ జగన్ బలాన్ని అంచనా వేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది.
కాంగ్రెసుపై తిరుగుబాటు చేసి వైయస్సార్ కాంగ్రెసుకు మద్దతుగా అవిశ్వాస తీర్మానాన్ని జోగి రమేష్, సుజయ కృష్ణరంగారావు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మద్దాలి రాజేష్, గొట్టిపాటి రవికుమార్, శివప్రసాద్ రెడ్డి, అళ్లనాని, పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బలపరిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు అమర్నాథ్ రెడ్డి, వనిత, బాలనాగిరెడ్డి, అళ్ల నాని, ప్రవీణ్ రెడ్డి, సాయిరాజ్ జగన్కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు.