అన్న వైయస్ జగన్ కోసం...: షర్మిల పాదయాత్ర సెంచరీ
మొత్తం యాత్రలో భాగంగా షర్మిల ఇప్పటి వరకు 1,375 కిలోమీటర్లు నడిచారు. నడక ద్వారా ఏడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టారు. ప్రస్తుతం ఆమె గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆదివారం పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ జిల్లాకు వస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీ పటిష్టత కోసం ఆమె పాదయాత్ర చేపట్టారు.
కాగా, శనివారం తన పాదయాత్రలో షర్మిల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమిళనాడులో డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి యూపిఏ నుండి తప్పుకుంటున్నామని ప్రకటన చేయగానే ఆయన కుమారుడు స్టాలిన్ ఇంటి పైన కేంద్రం సిబిఐ దాడులు చేయించిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు పార్లమెంటులో దీనిపై ప్రశ్నించిన తర్వాత సిబిఐ దాడులపై వెనక్కి తగ్గిందని ఆమె అన్నారు.
జగన్.. కాంగ్రెసుకు వ్యతిరేకమయ్యాకే కేంద్రం ఆయన ఆస్తులపై దర్యాఫ్తు సంస్థలను ప్రయోగించారన్నారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయ్యారని, అందుకే ఆయనపై ఎలాంటి విచారణలు జరగవన్నారు. దర్యాఫ్తును చేయించడం లేదు కాబట్టే బాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదన్నారు. రాజన్న పాలనలో ప్రజలపై పన్నుల భారం వేయకుండా అభివృద్ధిని సాధించారని షర్మిల చెప్పారు.