జగన్ నన్నేమీ అడగలేదు, సలహాలే ఇచ్చా: కెవిపి
పలు రికార్డులను, ఫైళ్లను ముందుంచి 'ఈ ఫైలు రూపొందండంలో మీ పాత్ర ఎంత వరకు ఉంది? దీనిద్వారా కొంతమంది భారీ ప్రయోజనాలు పొందారు. దీనికి మీరేం చెబుతారు' అంటూ సిబిఐ ఆయనపై ప్రశ్నలు సంధించింది. ఆయనను ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. అడిగినప్పుడు సలహా చెప్పడం తప్ప, తర్వాత దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారో, ఆ సలహా అసలు అమలైందో లేదో కూడా తానెప్పుడూ పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
తానెప్పుడూ ప్రభుత్వ దైనందిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, ఫైళ్లు చూడటం గానీ, నడపడం కానీ చేయలేదని చెప్పారు. ఆ ఫైళ్ల వల్ల ఎవరికి ఎలాంటి మేలు జరిగిందో తనకు తెలియదని, తనకు మాత్రం ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని స్పష్టం చేశారు. తను రాజశేఖరరెడ్డికి సన్నిహితుడినే అయినా మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నానని, రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లినప్పుడు కూడా తాను కాంగ్రెస్లోనే కొనసాగానని చెప్పినట్లు తెలిసింది.
జగన్ తనను ఎప్పుడూ ఏదీ అడగలేదని, తన ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదని చెప్పారు. "ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫైళ్లు చూడలేదు. చూడను కూడా. ఎక్కడా నా పేరుతో లావాదేవీలు, సంతకాలు ఉండవు. అడిగితే సలహాచెప్పడం, తర్వాత ఆ అంశాన్ని ముగించడం నాకు అలవాటు. ఇక ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డిని ఎప్పుడెప్పుడు ఎవరెవరు కలిశారో పట్టించుకోలేదు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి చాలా మంది నేతలు వచ్చి నన్ను కూడా కలిసి సలహాలు అడుగుతుండేవారు. నాకు తోచింది చెప్పేవాణ్ని కానీ నాకు ఎవరి వల్లా ఎలాంటి ప్రయోజనాలు అందలేదు'' అని కెవిపి వివరించినట్లు సమాచారం.