వంశీ నుండి మీరాకి పట్టణ బాధ్యత: గన్నవరం సస్పెన్స్
ఇప్పటి వరకు విజయవాడ పట్టణ అధ్యక్షుడిగా వల్లభనేని వంశీ ఉన్నారు. విజయవాడ పార్లమెంటు టిక్కెట్ ఆశించి చంద్రబాబు నుండి హామీ పొందిన కేశినేని నాని తన వర్గానికి చెందిన వారిని విజయవాడ పట్టణ అధ్యక్షుడిగా నియమించాలని అధ్యక్షుడిని కోరారు. అయితే, ఇప్పటికే వల్లభనేని వంశీ కొంత అసంతృప్తితో ఉన్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం, అతని సన్నిహితుడు కొడాలి నాని జగన్ పార్టీలోకి వెళ్లడంతో వంశీ పైనా అనుమానాలు రేకెత్తాయి. అయితే, ఆయన మాత్రం టిడిపిలోనే ఉంటానని ప్రకటించారు.
అంతేకాకుండా 2009లోనే వంశీ గన్నవరం టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. దాసరి బాలవర్ధన రావు కోసం వంశీని బాబు అప్పుడు బుజ్జగించి విజయవాడ టిక్కెట్ ఇచ్చారు. వంశీకి విజయవాడ నుండి పోటీ చేయడం ఇష్టం లేకున్నా పార్టీ ఆదేశాల మేరకు తప్పలేదు. ఇప్పుడు మాత్రం ఆయన గన్నవరం టిక్కెట్ కోసం బాబు వద్ద పట్టుబడుతున్నారట. గన్నవరం కోసం దాసరి, వంశీలు ఇద్దరు పోటాపోటీగా ఉండటంతో బాబు ఇప్పటి వరకు దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
దాసరిని బుజ్జగించి వంశీ కోరుకుంటున్న గన్నవరం ఇచ్చేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాదు కూడదంటే వంశీని బుజ్జగించి మరో నియోజకవర్గాన్ని కేటాయించవలసి ఉంటుంది. 2009 ఎన్నికల్లో గన్నవరం ఆశించి భంగపడటమే కాకుండా ఇప్పుడు విజయవాడ పట్టణ అధ్యక్షుడి బాధ్యతలను నాగుల్కు అప్పగించిన వంశీ తాను కోరుకున్న గన్నవరం రాకుంటే మాత్రం పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదు. అయితే, బాబు వంశీని వదులుకునేందుకు సిద్ధంగా లేరంటున్నారు. అదే సమయంలో దాసరికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారట.