జయలలిత బౌన్సర్: చెన్నైలో శ్రీలంక క్రికెటర్లు అవుట్
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బౌన్సర్కు శ్రీలంక క్రికెటర్లు అవుటయ్యారు. శ్రీలంక క్రికెటర్లు ఆడితే చెన్నైలో ఐపియల్ మ్యాచులను ఆడనివ్వబోమని జయలలిత చేసిన హెచ్చరికకు బిసిసిఐ తలొగ్గింది. మ్యాచులను ఇతర ప్రాంతాలకు తరలించే బదులు శ్రీలంక క్రీడాకారులు చెన్నైలో జరిగే మ్యాచుల్లో ఆడకపోతే సరిపోతుందనే నిర్ణయానికి బిసిసిఐ వచ్చింది. దాంతో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లతో ఆడించకూడదని నిర్ణయం తీసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తన జట్టులో ఉన్న శ్రీలంక క్రీడాకారులు నువాన్ కులశేఖర, అకిల ధనంజయలను తప్పించాలని నిర్ణయం తీసుకుంది.
నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే చెన్నైలో మ్యాచులు జరుగుతాయని తొలుత ప్రకటించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. అయితే, చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడకుండా చూసే ఉపాయం చేస్తున్నట్లు ఆయన మాటల్లో అర్థమైంది. అనుకున్నట్లుగానే చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు లేకుండా చూసుకునేందుకు తగిన ఏర్పాటు ఐపియల్ గవర్నింగ్ కౌన్సిల్ చేసుకుంది.
శ్రీలంకలో పది మ్యాచులు జరగనున్నాయి. మొత్తం 9 ఫ్రాంచైజీల్లో 13 మంది శ్రీలంక క్రీడాకారులున్నారు. చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడకుండా చూడాలని ఐపియల్ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకుని ఆ మేరకు ప్రకటన కూడా చేసింది. చెన్నై మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు చూడాలని ఐపియల్ ఫ్రాంచైజీలను కోరనుంది.
ఐపియల్లో పాలు పంచుకునే ఆటగాళ్లు, ప్రేక్షకులు, స్టేడియంలో పనిచేస్తున్న సిబ్బంది రక్షణ అత్యంత ప్రధానమైందని, ఈ విషయాన్ని చర్చించడానికి ఐపియల్ పాలకమండలి సమావేశమైందని బిసిసిఐ వర్గాలు చెప్పాయి. చెన్నైలో జరిగే పెప్సీ ఐపియల్ 2013 లీగ్ మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఉండబోరని, ఈ మేరకు ఫ్రాంచైజీలకు విజ్ఞప్తి చేస్తామని ఐపియల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఓ ప్రకటనలో చెప్పారు.
ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్కు రాసిన లేఖను, తమిళనాడులో పర్యటించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని శ్రీలంక ప్రభుత్వం ట్రావెల్ అడ్వయిజరీని జారీ చేసిందని, ఈ స్థితిలో తమిళనాడు ప్రజల మనోభావాలతో పాటు శ్రీలంక ఆటగాళ్ల భద్రత కూడా తమకు అంతే ముఖ్యమని ఆయన అన్నారు.