'కాంగ్రెస్ను ప్రశ్నిస్తే జగన్ పార్టీ నుండి సమాధానం'
కాగా, సభలో సమరం ముగించిన విపక్షాలు ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. విద్యుత్పై రగిలిన వేడిని సర్కారు దిగి వచ్చేదాకా కొనసాగించాలని తీర్మానించాయి. విద్యుత్ సమస్యలపై ఏప్రిల్ 1నుంచి దశల వారీగా ఉద్యమం చేపట్టాలనీ... గ్రామ స్థాయి నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇవ్వనున్నారు. కరెంటు విషయంలో ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని టిడిపి నేతలు హెచ్చరించారు.
విద్యుత్ సమస్యపై శాసన సభలో సర్కారుపై సమర భేరీ మోగించిన టిడిపి జనక్షేత్రంలో అంతకుమించి పోరాటపటిమ చూపాలని నిర్ణయించుకుంది. విద్యుత్ సమస్యపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. వీటన్నింటినీ 19వ తేదీన హైదరాబాద్కు తరలించి గవర్నర్కు సమర్పిస్తామని తెలిపారు.
టిడిపి ప్రజా ప్రతినిధులు చేపట్టిన నిరాహార దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. తొలిరోజు 25 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు దీక్ష చేపట్టగా... బుధవారం రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కూడా దీక్షలో చేరారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యేలు ఉమా మాధవరెడ్డి, ఏలేటి అన్నపూర్ణమ్మ, పరిటాల సునీత, సీతా దయాకరరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్థసారధి, ఊకె అబ్బయ్య, వెంకట రమణారావు, ఎల్. రమణ, పి.రాములు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, ప్రకాశ్ గౌడ్, పర్సా రత్నం, బల్లి దుర్గా ప్రసాదరావు, కె. రామకృష్ణ, ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ, సతీశ్రెడ్డి, సలీం తదితరులు రిలేదీక్షలు చేశారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, కొనకళ్ళ నారాయణరావు కొంతసేపు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు.