జగన్ పార్టీలో లుకలుకలు: అంబటికి అసమ్మతి చిచ్చు
కోఆర్డినేటర్ల నియామకం పేరిట పరోక్షంగా అభ్యర్థులను ప్రకటించటంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వివాదాలు మరింత ముదిరాయంటూ వార్తలు వస్తున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును నియమించటం పట్ల పార్టీ శ్రేణుల్లో నిరసన వ్యక్తమవుతున్నది. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని ఆ నియోజకవర్గ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సీటుపై నలందా విద్యా సంస్థల అధినేత వరప్రసాద్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్రెడ్డి వంటి పలువురు నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నుంచి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అంబటికి ఫోన్చేసి నియోజకవర్గంలో అడుగుపెడితే చంపేస్తామంటూ హెచ్చరికలు జారీచేయడం వైసీపీలో కలకలం రేకెత్తించింది. ఈ బెదిరింపుకాల్స్పై రాంబాబు సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగువెలిగి ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసులో చేరిన కేంద్ర మాజీమంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా కోఆర్డినేటర్ల నియామక ప్రక్రియలో సందిగ్ధంలో పడేశారని అంటున్నారు. తెనాలి నియోజకవర్గానికి ఆయనను కోఆర్డినేటర్గా నియమిస్తూ ఆయనతోపాటు గుదిబండి చినవెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి సోదరుడు)ని కూడా కో ఆర్డినేటర్గా నియమించారు.