బాబు సహకరిస్తేనే సాధ్యం: ఆమరణ దీక్షలో విజయమ్మ
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం విజయమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడారు. రాష్ట్రంలో సరైన ప్రతిపక్షం లేకపోవడం వల్లనే విద్యుత్ ఛార్జీలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారీతిగా పెంచుతోందని విజయమ్మ మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగాలంటే టిడిపి అందుకు సహకరించాలని కోరారు.
విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని ఆమె హామీ ఇచ్చారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు కిరణ్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. అన్నింటి పైనా ప్రభుత్వం ఛార్జీల భారం వేస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో 18-20 గంటలు విద్యుత్ కోతలు విధించారన్నారు.
మంత్రులను అడ్డుకున్న బిజెపి
నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు సునిత లక్ష్మా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను బిజెపి కార్యకర్తలు మంగళవారం అడ్డుకున్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వారు నినాదాలు చేశారు.
మూడో పంటకు ఉచిత విద్యుత్
విద్యుత్ విషయంలో ఈఆర్సీదే ఫైనల్ కాదని మంత్రి రఘువీరా రెడ్డి వరంగల్ జిల్లాలో అన్నారు. అవసరమైతే మూడో పంటకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షాల ఆందోళనకు ప్రజల మద్దతు లేదన్నారు.