కెవిపి వియ్యంకుడికి ఈడి పిలుపు: పెట్టుబడులపై ఆరా
మీడియా కథనాల ప్రకారం - ఇండ్ భారత్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఇండ్ భారత్ సన్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రఘురాజుకు చెందిన కంపెనీలు. 2007-08లో ఇండ్ భారత్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీలోకి రూ.600 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 2011లో ఇండ్ భారత్ సన్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోకి మరో 200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ మొత్తం రూ.800 కోట్ల పెట్టుబడుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇండ్ భారత్ సన్ ఎనర్జీలోకి వచ్చిన 200 కోట్ల పెట్టుబడుల్లో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టుగా సాక్ష్యాధారాలున్నాయని అంటున్నారు.
ఇండ్ భారత్ సన్ ఎనర్జీ అనే సంస్థను 2010లో ప్రమోట్ చేశారు. ఆ తర్వాత ఏడాదే ఈ కంపెనీలోకి మారిషస్ నుంచి 200కోట్ల రూపాయలు వచ్చాయి. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) అనుమతి లేకుండానే ఈ ఇన్వెస్ట్మెంట్ను ఇండ్ భారత్ సన్ ఎనర్జీ స్వీకరించిందని అంటున్నారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన విధానాల ప్రకారం విద్యుత్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఆటోమేటిక్ మార్గంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తారు. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ కేవలం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మాత్రమే.
ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, ట్రేడింగ్ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు రావాలంటే ఎఫ్ఐపీబీ అనుమతులు తప్పనిసరి. ఈ పెట్టుబడి వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా తేలడంలో ఆర్బీఐకి కూడా ఈడీ అధికారులు లేఖ రాసినట్టుగా తెలిసింది. రఘురాజు కంపెనీలకు వ్యతిరేకంగా నెల రోజుల క్రితమే ఈడీ అధికారులు కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు.
ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రాలోకి వచ్చిన 600 కోట్ల వ్యవహారంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ మీడియా వ్యాఖ్యానించింది. కేరళలో కేవలం 0.75 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవన విద్యుత్ కేంద్రంతో ప్రారంభమైన ఈ సంస్థకు ఇంతపెద్ద స్థాయిలో నిధులు ఎలా వచ్చాయన్నది ప్రశ్న ఈ 600 కోట్లు వచ్చిన తర్వాతే ఈ సంస్థ అనేక ఇతర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించింది. సెక్వెరియా అనే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థతోపాటు మరో ఏడు వేర్వేరు కంపెనీల నుంచి రూ.600 కోట్లు ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రాలోకి వచ్చినట్టుగా గుర్తించారు. ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో ఆరు కంపెనీలు మారిషస్లో ఒకే చిరునామాలో ఉన్నాయంటూ మీడియా వార్తాకథనాలు ప్రచురించింది.
కొద్ది నెలల క్రితం ఐటీ శాఖ రఘురాజు నివాస గృహాలు, కార్యాలయాలపై దాడులు చేసి సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు కోల్కతాకు చెందిన తప్పుడు కంపెనీల నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయల నిధుల వివరాలు బయటపడినట్టుగా తెలిసింది.