బాలయ్య X జూ. ఎన్టీఆర్: జగన్ ఎన్టీఆర్ పాచిక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా సాగుతున్న వారసత్వ పోరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తెలివిగా వాడుకున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఎన్టీ రామారావు కుమారుడిగా నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో తన స్థానం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందించేందుకు ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాత ఎన్టీ రామారావు వారసత్వం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
వారసత్వ పోరు కారణంగా నెలకొన్న వివాదంలో తనకు అనుకూలంగా జగన్ ఎన్టీ రామారావు పాచికను వాడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఎన్టీ రామరావు ఫొటోలను వాడుకోవడం ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని, తెలుగుదేశం పార్టీలో గందరగోళం సృష్టించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎత్తు వేయడంతో పాటు బాలకృష్ణ దూకుడుకు ఇప్పటి నుంచే బ్రేకులు వేసే ఆలోచన కూడా అందులో ఉందని అంటున్నారు.
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. ఎన్టీ రామారావు అభిమానులు కూడా ఎక్కువే ఉంటారు. బాలకృష్ణ కూడా కృష్ణా జిల్లాపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తున్నారు. పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కొడాలి నానికి గుడివాడలో గుణపాఠం చెప్పాలనే సంకల్పంతో బాలకృష్ణ ఉన్నారు. దీంతో బాలకృష్ణ ఎత్తులను తిప్పికొట్టడానికి, ఎన్టీ రామారావు వారసత్వం విషయంలో గందరగోళం సృష్టించి బాలకృష్ణను ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఫొటోలను ముందుచూపుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వాడుకుంటున్నట్లు చెబుతున్నారు.
తాత వారసత్వం కోసం ఉవ్విళ్లూరుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చే స్థితిలో లేరు. ఈ సమయంలో బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో నిలదొక్కుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఆశయం నెరవేరడం కష్టమే అవుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినా జూనియర్ ఎన్టీఆర్కు లాభించే అవకాశాలు లేవు. దాంతో పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సహకరిస్తున్నారనే ప్రచారం ముమ్మరంగానే సాగుతోంది. తన వర్గానికి చెందిన కృష్ణా జిల్లా నాయకులను ఆయన ఒక్కరొక్కరినే వైయస్సార్ కాంగ్రెసులోకి పంపిస్తున్నారని కూడా అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్పై జరుగుతున్న ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ ఆయన వైఖరి మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లాభించే విధంగా ఉంది. ఫ్లెక్సీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన ఫొటోలను వాడుకున్నా జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపడం లేదు. తనను కాదనుకున్న తర్వాత చంద్రబాబుకు గానీ బాలయ్యకు గానీ తాను ఎందుకు విధేయత ప్రకటించాలనే వాదనను ఆయన ముందుకు తెచ్చే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు.
తాను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ రెండు మూడు సార్లు ప్రకటించారు. తనను పిలిస్తే బాబాయ్ బాలయ్య కోసం ప్రచారం చేస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే, చంద్రబాబు, బాలయ్య ఆయనను పిలిచే మాట అటుంచి, ఆయనను దూరంగా పెట్టేందుకు నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యూహానికి పదును పెట్టారని చెబుతున్నారు. ఆ వ్యూహానికి అనుగుణంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలనే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాడుకుంటోందని, బాలకృష్ణను ఎదుర్కోవడానికి కూడా అది పనికి వస్తుందని ఆ పార్టీ భావిస్తోందని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ బాలకృష్ణ మాట్లాడితే ఎదుర్కోవడానికి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ రాజకీయాలకు వారసుడు కాడని, ఎన్టీఆర్ పథకాలను రద్దు చేసిన చంద్రబాబు ఎన్టీ రామారావు వారసుడు ఎలా అవుతారని వాదించేందుకు వారు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ చిక్కుల్లో పడే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. బాలయ్యను ఎదుర్కోవడానికి ఇంతకన్నా పదునైన వ్యూహం మరోటి ఉండదని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.